Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 26(నమస్తే తెలంగాణ) : వెస్ట్ సిటీ తరహాలో హైదరాబాద్ నలుమూలలా హైరైజ్ కల్చర్ విస్తరిస్తున్నది. ఒకప్పుడు వెస్ట్ సిటీకి మాత్రమే పరిమితమైన ఆకాశహర్మ్యాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈస్ట్ సిటీలోని ఉప్పల్ ప్రాంతం హైరైజ్కు కేంద్రంగా మారుతున్నది. ఇప్పటికే బడాబిల్డర్లు ఈస్ట్ సిటీలో భారీ భవనాలకు ప్లాన్ చేస్తుండగా.. తాజాగా ప్రముఖ ఐటీ సంస్థ జెన్పాక్ట్తో కలిసి రాంకీ నిర్మాణ సంస్థ ఉప్పల్ కేంద్రంగా హైరైజ్లో సొంత క్యాంపస్ను నిర్మిస్తున్నది.
సిటీ నలుమూలలా హైరైజ్ భవనాలకు డిమాండ్ పెరుగుతున్నది. రెసిడెన్షియల్, కమర్షియల్ అనే తేడా లేకుండా ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న జెన్పాక్ట్ సంస్థ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం సమీపంలో 15 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నది. 15 ఫ్లోర్లతో 1.9 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ క్యాంపస్ నిర్మిస్తుండగా.. 15వేల మంది ఉద్యోగులు ఒకేచోట కలిసి పనిచేసేలా ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తున్నది. ఇప్పటికే ప్రాజెక్టులో లెవలింగ్ పనులు పూర్తి కాగా తాజాగా ఎక్సావేషన్ పనులను నిర్మాణ సంస్థ మొదలుపెట్టింది.
వెస్ట్ జోన్తో పోల్చితే ఈస్ట్ సిటీలోని ఉప్పల్, ఎల్బీనగర్, ఆదిభట్ల, పోచారం వంటి ప్రాంతాలు ఐటీ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయి. మెట్రో అందుబాటులోకి రావడంతో కంపెనీలు ఇటు వైపు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే భారీ ఐటీ క్యాంపస్ ఉప్పల్ జంక్షన్కు సమీపంలోనే అందుబాటులోకి వచ్చింది. దాని పక్కనే 40 అంతస్తుల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టును అదే కంపెనీ మూడేళ్ల క్రితమే ప్రకటించగా..ఇటీవల హైదరాబాద్కు చెందిన పలు నిర్మాణ సంస్థలు 30 అంతస్తులకు పైగా ఉండే భారీ ప్రాజెక్టులను ఈస్ట్ సిటీలో ప్రారంభించాయి. దీంతో వెస్ట్ సిటీ తరహాలో ఈస్ట్ సిటీవైపు ఆకాశ హర్మ్యాలు క్యూ కడుతున్నాయని రియల్ వర్గాలు చెబుతున్నాయి.