సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : పాత నగరంలో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జూపార్కును అనుకొని ఉన్న మీరాలం చెరువు మీదుగా 2.5 కి.మీ మేర నిర్మించే హైలెవల్ బ్రిడ్జి బెంగళూరు జాతీయ రహదారి నుంచి అత్తాపూర్ వైపు చింతల్కుంట రోడ్డుకు అనుసంధానం చేసేలా నిర్మాణం చేపట్టనున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో మీరాలం ట్యాంక్ మీదుగా ఈ హై లెవల్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉంచగా, దానికి కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.363 కోట్లతో మీరాలం చెరువు హై లెవల్ బ్రిడ్జిని నాలుగు వరుసల్లో నిర్మించనున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన పరిపాలన అనుమతులను జారీ చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ జీవో ఆర్టీ నం.120 సోమవారం జారీ చేసింది. పార్లమెంటు ఎన్నికల కోడ్ రాకముందే శంకుస్థాపన పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు
చేస్తున్నది.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నలుమూలలా విస్తరిస్తున్నా పాతనగరంలో మాత్రం మౌలిక వసతుల కల్పనకు గత ప్రభుత్వాలు ప్రాధాన్యతనివ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పాతనగరంలోని బహదూర్పురలో ఇప్పటికే ఒక ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించి ప్రారంభించగా, మరో ఫ్లై ఓవర్ జూపార్కు నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు నిర్మాణంలో ఉంది. ఇదే ప్రాంతంలో ఉన్న మీరాలం చెరువు మీదుగా మెహిదీపట్నం, అత్తాపూర్ వైపు ఉన్న ఇన్నర్ రింగు రోడ్డుతో అనుసంధానం అయ్యేలా మీరాలం ట్యాంక్ మీదుగా అత్యాధునిక శైలిలో, నగరానికి మరింత వన్నె తెచ్చేలా హై లెవల్ బ్రిడ్జిని నిర్మించాలని సూచించడంతో హెచ్ఎండీఏ అధికారులు రెండు రకాల ప్రతిపాదనలను రూపొందించారు. హైటెక్ సిటీలోని దుర్గం చెరువు మీదుగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి తరహాలో నిర్మించాలని ప్రతిపాదిస్తే రూ.700 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. దానికి బదులుగా సాధారణంగా ఉండే బ్రిడ్జిని నిర్మించాలని మరో ప్రతిపాదనను సిద్ధం చేయగా, దానికి రూ.360 కోట్ల వరకు అవుతుందని అంచనా వేశారు. నగరంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో పేరుగాంచిన హెచ్ఎండీఏ దీన్ని నిర్మించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేసింది.