సిటీబ్యూరో, నవంబర్ 21(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాణం పోస్తున్నది. సీఎం కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి వేల కోట్ల నిధులు కేటాయిస్తూ సర్కార్ దవాఖానలను కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. సూపర్ స్పెషాలిటీ వసతులు.. అధునాతనమైన శస్త్ర చికిత్సలు.. 58 రకాల ఉచిత పరీక్షలు, సకాలంలో రిపోర్టులు వెరసి కింగ్ కోఠిలోని జిల్లా కేంద్ర దవాఖాన ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నది. రోజు రోజుకు వసతులను మెరుగుపర్చుకుంటూ సేవల్లో కింగ్లా దుసుకెళ్తున్నది.
మూడేండ్లలో రెండు లక్షలకు పైగా పరీక్షలు..
వివిధ వ్యాధుల నిర్ధారణకు రూ.వేలల్లో ఖర్చు పెట్టలేని పేదల కోసం ప్రభుత్వం మూడేండ్ల క్రితం ఇక్కడి హాస్పిటల్లో డయాగ్నోస్టిక్ హబ్ను ఏర్పాటు చేసింది. ఇందులో రక్త, మల, మూత్ర పరీక్షలు, టైఫాయిడ్, డెంగీ, మలేరియా, జ్వరాల నిర్ధారణ, కాలేయం, మూత్ర పిండాలు, థైరాయిడ్ పనితీరు పరీక్షలు, కొలెస్ట్రాల్, షుగర్ వంటివాటితోపాటు 58 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు. ఆధునాతనమైన పరికరాలతో రోగులు దవాఖానకు వచ్చిన రోజే పరీక్షలు జరిపి రిపోర్టులు అందజేస్తున్నారు. మూడేండ్లలో రెండు లక్షలకుపైగా పరీక్షలను ఉచితంగా చేసినట్లు వైద్యులు తెలిపారు.
టిఫా స్కాన్తో తప్పిన తిప్పలు..
టిఫా (టార్గెట్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ ఎనామలిస్) స్కానింగ్ సేవలు నిన్నమొన్నటి వరకు ప్రైవేటు హాస్పిటల్స్, ల్యాబ్లలో మాత్రమే అందుబాటులో ఉండేవి. ఈ స్కానింగ్కు రూ.2,500 నుంచి రూ.3వేల వరకు ఖర్చు అవుతుంది. ఆరు నెలల క్రితమే ప్రభుత్వం కింగ్ కోఠి జిల్లా దవాఖానలో రూ.30 లక్షలు వెచ్చించి టిఫా స్కాన్తోపాటు ఆల్ట్రా సౌండ్ సదుపాయాలను అందుబాటులోకి తేవడంతో గర్భిణులకు తిప్పలు తప్పాయి.
ఆధునిక సదుపాయాలు..
మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం
పైసా ఖర్చు లేకుండా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు అనుగుణంగా కింగ్ కోఠి జిల్లా దవాఖానలో సకల సదుపాయాలతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాం. వివిధ విభాగాలకు సంబంధించి 40 మంది స్పెషలిస్టులు ఉన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుండడంతో హాస్పిటల్కు వచ్చేవారి సంఖ్య కూడా గతంలో కంటే ఎక్కువగా ఉంది.
– డాక్టర్ రాజేంద్రనాథ్, సూపరింటెండెంట్,
కింగ్ కోఠి జిల్లా కేంద్ర దవాఖాన