హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి మండలం మియాపూర్లోని 28/1, 20, 159 సర్వే నెంబర్లల్లోని 380 ఎకరాల లేఔట్ భూమిని సర్వే చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లేఔట్లో ప్రజావసరాల కోసం వదిలిన స్థలం ఎంత ఉందో సర్వే చేయించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలంది.
రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీ, మయూరి నగర్ సంక్షేమ సంఘంతో కమిటీ వేసి 4 నెలల్లోగా సర్వే పూర్తి చేయాలని సూచించింది. సర్వేలో ప్రజోపయోగం కోసం వదిలిన స్థలం 10 శాతం కంటే ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్న మేరకు ప్రభుత్వ అనుమతితో హెచ్ఎండీఏ వేలం వేసుకోవచ్చునని స్పష్టం చేసింది. సర్వేలో 10 శాతం కంటే తక్కువ ఉంటే 2018లో నిర్వహించిన 40 ప్లాట్ల వేలాన్ని రద్దు చేయాలని హుడాను ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. మాధవి దేవి తీర్పిచ్చారు.
మియాపూర్లోని 380 ఎకరాల్లో నివాస గృహాల నిర్మాణాలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఇందులో కొంత మేరకు ప్రజావసరాల కోసం కేటాయించిన వాటిని హుడా వేలం వేస్తోందంటూ మయూరి నగర్ సంక్షేమ సంఘం, ఇతరులు హైకోర్టులో సవాల్ చేశారు. పార్కులు, పాఠశాలలు, కమ్యూనిటీ హాల్, ఆస్పత్రి వంటిని నిర్మించాల్సిన స్థలాలను వేలం వేయడాన్ని పిటిషనర్లు వ్యతిరేకించారు.
దీనిపై హెచ్ఎండీఏ స్పందిస్తూ, 1995లో లేఔట్ వేసినప్పుడు 13.7 శాతం స్థలాలను వదిలిపెట్టామని, ప్రజావసరాల కోసం 6.11 కేటాయించగా మిగిలిన స్థలాలను వేలం వేసుకునే హక్కు తమకు ఉందని చెప్పింది. దీనిపై హైకోర్టు.. ఒకసారి ఆమోదించిన లేఔట్లో మార్పులు, చేర్పులు చేయాలంటే హుడా, హెచ్ఎండీఏ తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొందాలని, 10 శాతం ప్రజోపయోగం కోసం ఉండి తీరాలని, ఆపై ఉంటే హుడా వేలం నిర్వహించుకోవచ్చునని తీర్పు చెప్పింది.