హైదరాబాద్, డిసెంబర్ 12 (మస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రధాన చెరువుల ఆక్రమణలపై తదుపరి విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆ రెండు జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. చెరువు నీటి నిల్వ పూర్తి సామర్థ్యం, సరిహద్దులు నిర్ణయించి రాళ్లు ఏర్పాటు చేయాలని పదేళ్ల కిందట ఆదేశాలు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఉమ్మడిగా సర్వే చేసి స్థాయి నివేదిక అందజేయాలన్న ఉత్తర్వులు ఇప్పటివరకు అమలు చేయలేదని తప్పుబట్టింది. తదుపరి విచారణలోగా నివేదిక అందజేయాలని, విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని దుర్గంచెరువు, సున్నం చెరువు, ఫిర్జాదిగూడ పెద్ద చెరువు, చిన్న ధామర చెరువు, చిన్న రాయుని చెరువు, నల్ల చెరువు.. ఇలా పలు చెరువులను ఆక్రమించి ఆక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మాదాపూర్కు చెందిన అనిల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.