GHMC | హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 3 జిల్లాల్లో మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప.. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు. వరదలు, చెట్లు కూలడం వంటి సమస్యలపై ఫిర్యాదులకు జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్లు – 040 – 21111111, 9000113667.
గడిచిన మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలమండలి కూడా అప్రమత్తమైంది. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది. తాగునీటి సరఫరా, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ సమయంలో కలుషితనీరు సరఫరా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎండీ అధికారులకు సూచించారు. తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. తరచూ సీవరేజీ ఓవర్ఫ్లో అయ్యే మ్యాన్హోళ్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని ఎండీ చెప్పారు. జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. మ్యాన్హోళ్ల మూతలు తెరవడం జలమండలి యాక్ట్లోని 74వ సెక్షన్ ప్రకారం నేరమని, అతిక్రమిస్తే.. క్రిమినల్ కేసులు నమోదవుతాయని ఎండీ హెచ్చరించారు. ఎక్కడైనా మ్యాన్హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
వర్షాల నేపథ్యంలో నగరంలో దాదాపు 16 ఈఆర్టీ బృందాలను జలమండలి ఏర్పాటు చేసిందని, ఒక్కో బృందంలో ఐదుగురు సిబ్బందితోపాటు ఇతర అత్యవసర సామగ్రి ఉంటుందన్నారు. నీరు నిలిచిన ప్రాంతంలో వాటిని తొలగించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ వాహనాల్లో జనరేటర్తో కూడిన డీవాటర్ మోటర్ ఉంటుందన్నారు. అంతేకాకుండా ఆరు ఎస్పీటీ వాహనాలు, మరో 16 మినీ ఎయిర్టెక్ వాహనాలను 24 అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.