హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి కుండపోత వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఓ రెండు గంటల పాటు వాన దంచికొట్టింది. ఆ రెండు గంటల్లోనే 100 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.
అత్యధికంగా హయత్నగర్లో 98.5 మి.మీ., అంబర్పేట్లో 89.8 మి.మీ., సైదాబాద్లో 88.0 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నది. బహదూర్పురా, చార్మినార్, హిమాయత్నగర్, నాంపల్లిలో 80 మి.మీ. వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమై.. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించిన విషయం విదితమే.
భారీ వర్షాలకు మూసారాంబాగ్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించింది. దీంతో మూసారాంబాగ్ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మలక్పేట రైల్వే వంతెన కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. అక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షానికి పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.