హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుకుగా ఉన్నాయని, వీటి ప్రభావంతో రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఈ మేరకు ప్రాథమిక హెచ్చరిక జారీచేసింది. ఏపీ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నదని తెలిపింది.
ఉత్తర అండమాన్ సముద్రం నుంచి ఏపీ తీరం వరకు మధ్య బంగాళాఖాతం మీదుగా ఉన్న తూర్పు పడమర ద్రోణి తాజాగా రాయలసీమ వరకు విస్తరించి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నదని వెల్లడించింది. అక్టోబర్ 1న ఈశాన్య పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నదని తెలిపింది. వీటి ప్రభావంతో 2వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ మేరకు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రం గారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.