సికింద్రాబాద్, జూలై 22: ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచే వర్షం దంచి కొట్టడంతో జనజీవనం స్తంభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా పడుతున్న వానతో ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే నగరవాసులు వణికిపోయారు. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు బయటకు వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.
భారీ వర్షం కారణంగా సికింద్రాబాద్ స్టేషన్, ప్యాట్నీ చౌరస్తా, కంటోన్మెంట్ బోర్డు, మారేడ్పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బోయిన్పల్లి, రసూల్పురాతో పాటు మోండా డివిజన్, రెజిమెంటల్ బజార్, బౌద్ధనగర్, సీతాఫల్మండి, తార్నాక, మెట్టుగూడ, అడ్డగుట్ట ప్రాంతాల్లోని పలు బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. మరోవైపు కార్ఖానా ప్రధాన రహదారితో పాటు సికింద్రాబాద్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని రోడ్లపై మోకాల్లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కురవడంతో తార్నాక, బోయిన్పల్లి, రైల్ నిలయం, సంగీత్ చౌరస్తా, జేబీఎస్ ప్రాంతాల వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ మన్సూన్ సిబ్బంది రోడ్లపై నిలిచిన నీళ్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
ఉస్మానియా వర్సిటీలో గొడుగులు పెట్టుకొని కళాశాలకు వెళ్తున్న విద్యార్థులు