సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం గ్రేటర్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి చల్లబడిన వాతావరణం మధ్యాహ్నానికి ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని ఉరుములతో కూడిన వాన పడింది. కొన్ని చోట్ల వడగండ్లు సైతం పడ్డాయి. సాయంత్రం 5గంటల వరకు రాజేంద్రనగర్, శివరాంపల్లిలో అత్యధికంగా 4.3 సెం.మీల వర్షపాతం నమోదైంది. మైలార్దేవ్పల్లిలో 4.0 సెం.మీలు, శాస్త్రిపురంలో 2.8 సెం. మీలు, పాతబస్తీ బండ్లగూడలో 2.7 సెం.మీలు, కందికల్గేట్లో 2.6 సెం.మీలు, బహదూర్పురా చందూలాల్ బారాదరిలో 2.3 సెం.మీలు, ఖాజాగూడలో 2.1సెం.మీలు, చార్మినార్ సర్దార్మహల్లో 1.4 సెం.మీలు, దూద్బౌలిలో 1.4 సెం.మీలు, ఆసిఫ్నగర్, సరూర్నగర్లో 1.3 సెం.మీలు, హయత్నగర్, కాంచన్బాగ్లో 1.1 సెం.మీలు, గోల్కొండ, నాంపల్లి, లింగోజిగూడలో 1.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల మరో రెండు రోజుల పాటు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్పై జారీచేసిన ఎల్లో హెచ్చరికలు కొనసాగుతాయని తెలిపారు. మరోవైపు నగరంలో గురువారం ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే కిందకు పడిపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21.6 డిగ్రీలు, గాలిలో తేమ 85 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
బండ్లగూడ, మార్చి 16 : 2 గంటల పాటు కురిసిన వర్షంతో రాజేంద్రనగర్, బండ్లగూడ, అత్తాపూర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. సుమారు గంటకు పైగా రోడ్లపై వర్షం నీరు నిల్వడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
శంషాబాద్ రూరల్, మార్చి 16 : శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. సుమారు గంటపాటు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురవడంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు ఇండ్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. పదేండ్ల నుంచి ఇలాంటి వడగండ్ల వాన పడలేదని చెప్పారు. శంషాబాద్ బస్స్టాండ్లో వర్షపు నీరు నిల్వడంతో బస్సుల రాకపోక
లకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.