Niloufer Hospital | సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : నిలోఫర్ దవాఖాన కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ-ఎస్ఎన్సీయూ సేవలను అందించేందుకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి నిలోఫర్లో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు శనివారం ప్రారంభించనున్నారు. ఈ-ఎస్ఎన్సీయూ హబ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44 ఎస్ఎన్సీయూలను వీడియా కాల్ ద్వారా నిలోఫర్లోని నియోనాటల్ వైద్యనిపుణులు పర్యవేక్షించడమే కాకుండా శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం, మెడికల్ రిపోర్టులను పరిశీలించి వాటి ఆధారంగా అవసరమైన మెడికేషన్ను సూచించడంతో పాటు తదితర సేవలను అందించనున్నట్లు నిలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు.
ప్రతి రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పదుల సంఖ్యలో ఎస్ఎన్సీయూ రెఫరల్ కేసులు నిలోఫర్కు వస్తుంటాయి. దీంతో నిలోఫర్పై పనిఒత్తిడి పెరగడమే కాకుండా ముఖ్యంగా శిశువును దూర ప్రాంతం నుంచి నిలోఫర్కు తరలించే లోపు ఆరోగ్యం మరింత క్షీణించడం, కొన్ని సందర్భాల్లో గోల్డన్టైమ్ మించిపోయి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం లేకపోలేదని ఉషారాణి అన్నారు. ఈ సమస్యను అధిగమించి చిన్నారుల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ఈ-ఎస్ఎన్సీయూ హబ్ను ప్రారంభించినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నవజాత శిశువుల కోసం ఎస్ఎన్సీయూలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 44ఎస్ఎన్సీయూ సెంటర్లు అందుబాటులో ఉండగా ప్రస్తు తం 18 సెంటర్లను నిలోఫర్లోని ఈ-ఎస్ఎన్సీయూ హబ్కు అనుసంధానం చేసినట్లు డా. ఉషారాణి తెలిపారు. నిలోఫర్లో ఏర్పాటు చేసి న ఎస్ఎన్సీయూ హబ్ ద్వారా వైద్యనిపుణులు నిరంతరం రాష్ట్రంలోని ఎస్ఎన్సీయూ సెంటర్లను పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.
శిశుమరణాలను తగ్గించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉంటుందని డా.ఉషారాణి తెలిపారు. అయితే ఎర్లీ నియోనాటల్ మొర్టాలిటీ రేట్(ఈఎన్ఎంఆర్), నియోనాటల్ మొర్టాలిటీ రేట్(ఎన్ఎంఆర్)తో పాటు ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్(ఐఎంఆర్)ను మరింత తగ్గించేందుకు ఈ-ఎస్ఎన్సీయూ హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. రూ.50లక్షలతో నిలోఫర్లో ఈ హబ్ను ఏర్పాటు చేశామని, ఇక్కడి నుంచి 24గంటల పాటు రా్రష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్ఎన్సీయూ కేంద్రాలను పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఆయా సెంటర్లలో చికిత్స పొందుతున్న శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా అవసరమైన సూచనలు ఇస్తామని తెలిపారు. ఈ హబ్ వల్ల ముఖ్యంగా రెఫరల్ కేసులు బాగా తగ్గుతాయని, ముఖ్యంగా ఈ సమస్యను అధిగమించి, ఉన్న చోటనే మెరుగైన చికిత్స అందించే వీలుంటుందని, దీంతో శిశువు ఆరోగ్యం కాపాడడంతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా తిరిగే ప్రయాస తప్పుతుందని తెలిపారు. జిల్లాల్లో ఎస్ఎన్సీయూ విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి మార్గనిర్దేశంతో పాటు చికిత్సా విధానాల్లో మెలుకులు, నూతన పద్ధతులపై శిక్షణ, అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఈ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశామని, పుట్టిన చోటనే శిశువులకు పూర్తిస్థాయి చికిత్స అందించనున్నామని తెలిపారు.