కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 5 : పేదల అభివృద్ధే.. మాకు గీటురాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. రంగధాముని చెరువును మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు అదనపు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని రంగధాముని చెరువుగట్టుపై రూ.9.80 కోట్లతో అభివృద్ధి చేసిన రంగధాముని ఫ్రంట్లేక్ పార్కును, చెరువు సుందరీకరణలో భాగంగా మురుగునీటి మళ్లింపు కోసం రూ.19.30 కోట్లతో సీవరేజ్ పైప్లైన్, అభివృద్ధి పనులను గురువారం మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్లతో కలిసి ప్రారంభించారు.
అనంతరం కేపీహెచ్బీ కాలనీలోని కల్వరి టెంపుల్ రోడ్డులో శ్రీలాపార్కు ప్రైడ్ నుంచి ముళ్లకత్వ చెరువు ఎస్టీపీ వరకు రూ.11.63 కోట్లతో చేపట్టనున్న సీవరెజ్ పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత కూకట్పల్లి ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. రంగధాముని చెరువు 600 మీటర్ల సుందరీకరణ పనులు చేస్తున్నామని, మరో 1.6 కి.మీ. దూరం చెరువు అభివృద్ధికి అదనపు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత, హెచ్ఎండీఏ ఈఈ పద్మ, ఏఈ సంధ్య, కార్పొరేటర్ శిరీషాబాబూరావు, తదితరులు పాల్గొన్నారు.
చెరువులోకి మురుగునీరు చేరకుండా..
కూకట్పల్లి, బాలాజీనగర్, కేపీహెచ్బీ కాలనీ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు చెరువులోకి చేరకుండా మళ్లించేందుకు గాను చెరువు పక్కనుంచి 1200 ఎంఎం డయా ఆర్సీసీ పైపులైన్లను వేయనున్నారు. అదేవిధంగా చెరువు చుట్టూరా రెయిలింగ్ ఏర్పాటు, నడక మార్గం (ఫుట్పాత్), విద్యుత్ దీపాలు, పచ్చని మొక్కలు, ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు. ఈ పనులు పూర్తయితే రంగధాముని చెరువు ట్యాంక్బండ్ తరహాలో పర్యాటక కేంద్రంగా మారనున్నది. అదేవిధంగా శ్రీలాపార్కు ప్రైడ్ నుంచి ఎస్ఎంఆర్ వినయ్, డ్రీమ్వ్యూ కాలనీ, గోపాల్నగర్ మీదుగా ముళ్లకత్వ చెరువు ఎస్టీపీ వరకు 450/600/800/900 ఎంఎం డయా సామర్థ్యాలతో కూడిన ఆర్సీసీ పైప్లను వేయనున్నారు. దీంతో ఆయా కాలనీల పరిధిలో మురుగునీటి సమస్యకు పరిస్కారం లభించనున్నది.
మరోసారి ఆశీర్వదించండి
గతంలో గులాబీ జెండాను చూసి భయపడిన ప్రజలే నేడు ఆ జెండాతోనే ఘన స్వాగతం పలుకుతున్నారని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. కన్న బిడ్డలా, తమ్ముడిలా మీవెంటే ఉన్నానని.. ఉదయం 6 గంటల నుంచే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన, ఇవ్వని హామీలన్నింటినీ నెరవేర్చానని మరోసారి ఆశీర్వదిస్తే కూకట్పల్లిని మరింతగా అభివృద్ధి చేస్తానని ప్రజలను కోరారు.
ఫ్రంట్లేక్ పార్కు
ఫ్రంట్లేక్ పార్కును సకల వసతులతో అభివృద్ధి చేశారు. చెరువుగట్టుపై ఫేవర్ బ్లాక్స్తో పాత్వేలు, ఫ్లోరింగ్, స్టెప్డ్ అండ్ క్యూబికల్ సీటింగ్, శిల్పాలు, విద్యుత్ లైటింగ్, టాయిలెట్ బ్లాక్, సాఫ్ట్ స్కేప్ను ఏర్పాటు చేశారు. ఇవి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.