మన్సూరాబాద్, మార్చి 16: గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరిని హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఎల్బీనగర్లోని డీసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ బి.సాయశ్రీ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, ముంబై, భీవండి సిటీలో లాల్బీ గులామ్ షేక్ అనే వ్యక్తి లావణ్య లాజిస్టిక్ పేరుతో ట్రాన్స్ఫోర్ట్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. కర్ణాటక, భీదర్ జిల్లా, బల్కికి చెందిన భరత్ బాపురావు పంచన్(34) ప్రస్తుతం మహారాష్ట్ర, థానే జిల్లా, భీవండి, కమత్ఘర్లో నివాసముంటున్నాడు. వృత్తిరీత్యా డ్రైవర్గా పని చేస్తున్నాడు.
మహారాష్ట్ర, థానే జిల్లా, భీవండి, ఆనంద్నగర్కు చెందిన ఆకాశ్ అనురథ్కాంబ్లే(38) వృత్తిరీత్యా డ్రైవర్గా పని చేస్తున్నాడు. భరత్ బాపురావు పంచన్, ఆకాశ్ అనురథ్కాంబ్లే ఇద్దరు గత రెండేండ్లుగా లాల్బీ గులామ్షేక్ వద్ద డీసీఎం డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, విశాఖ జిల్లా, చింతపల్లి ఏజెన్సీ నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తే వచ్చే లాభాలపై భరత్ బాపురావు పంచన్, ఆకాశ్ అనురథ్కాంబ్లేకు లాల్బీ గులామ్షేక్ వివరించారు. ఒక్కో ట్రిప్పుకు ఇద్దరు డ్రైవర్లకు లక్ష రూపాయలు ఇచ్చేలా లాల్బీ గులామ్షేక్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. విశాఖపట్నం, చింతపల్లి ఏజెన్సీలో ప్రసాద్, అన్వర్పాష, రాణి అనే ముగ్గురి వద్ద గంజాయి కొనుగోలు చేసి రాజమండ్రి, ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్ మీదుగా ముంబైకి తరలించాల్సి ఉంటుందని తెలిపాడు.
ఇలా పలుసార్లు ప్రసాద్, అన్వర్పాష, రాణి వద్ద కిలోకు రూ.2వేల చొప్పున కొనుగోలు చేసి డీసీఎంలో గంజాయిని ముంబైకి తరలించారు. గంజాయి రవాణా సాఫీగా సాగుతుండటంతో తనకు వచ్చే ఆదాయంలో డ్రైవర్లు భరత్ బాపురావు పంచన్, ఆకాశ్ అనురథ్కాంబ్లేకు పది శాతం కమీషన్ కింద ట్రిప్కు రూ.2లక్షలు ఇచ్చేందుకు లాల్బీ గులామ్షేక్ అంగీకరించాడు. ఈనెల 14న ముంబై నుంచి డీసీఎంలో మెడిసిన్స్ లోడ్ తీసుకుని విజయవాడకు బయలుదేరారు. మెడిసిన్స్ అన్లోడ్ అనంతరం డ్రైవర్లు ఇద్దరు లాల్బీ గులామ్షేక్ను ఫోన్లో సంప్రదించారు.
అనకాపల్లికి డీసీఎం తీసుకుని వెళ్లాలని సూచించాడు. ప్రసాద్, అన్వర్పాష, రాణి ముగ్గురు కలిసి ఈనెల 15న కారులో 160 కేజీల గంజాయిని తీసుకువచ్చి భరత్ బాపురావు పంచన్, ఆకాశ్ అనురథ్కాంబ్లేకు అప్పగించారు. లాల్బీ గులామ్షేక్ ఆదేశాలనుసారం గంజాయిని తీసుకుని ముంబైకి బయలుదేరారు. గంజాయి అక్రమ రవాణాపై అప్పటికే హయత్నగర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో గురువారం ఉదయం పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్ద పోలీసులు తనిఖీ చేపట్టారు. అదే సమయంలో అటు వైపుగా వచ్చిన డీసీఎం(ఎంహెచ్04 కేఎఫ్ 1640)ను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. నిందితులైన భరత్ బాపురావు పంచన్, ఆకాశ్ అనురథ్కాంబ్లేను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నలుగురు లాల్బీ గులామ్షేక్, ప్రసాద్, అన్వర్పాష, రాణి పరారీలో ఉన్నారు. ఈ సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ కె.పురుషోత్తంరెడ్డి, వనస్థలిపురం సీఐ హెచ్.వెంకటేశ్వర్లు, డీఐ ఆర్.నిరంజన్ పాల్గొన్నారు.