సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు ఇన్నోవా వాహనంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. రూ. 1.2 కోట్ల విలువైన 450 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర బీద్ జిల్లాకు చెందిన మహ్మద్ బాబూమియా షేక్, సతీష్ జాదవ్, సుభాష్ జాదవ్, బాబు కాలే, షేక్ యజాజ్ సికిందర్, ఆంధ్రప్రదేశ్ రంపచోడవరానికి చెందిన ధాను ఒక ముఠాగా ఏర్పడ్డారు. రంపచోడవరం నుంచి మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు తరచూ గంజాయి సరఫరా చేస్తున్నారు.
ఇందులో మహ్మద్ బాబూమీయా షేక్ రంపచోడవరంలోని ధను వద్దనుంచి కిలో గంజాయి రూ. రెండు వేలకు కొనుగోలు చేస్తున్నాడు. దానిని మహారాష్ట్రకు తరలించి రూ. 10 వేలకు కిలో చొప్పున ఈ గ్యాంగ్లోని ఇద్దరికి విక్రయిస్తాడు. వారిద్దరూ వివిధ ప్రాంతాల్లో కిలో రూ.20 వేలు చొప్పున విక్రయిస్తారు. ఈ క్రమంలో బాబూమీయా, షేక్ యజాజ్ సికిందర్ కలిసి ఇన్నోవా వాహనంలో రంపచోడవరం వెళ్లారు. అక్కడ ధానును కలిసి 450 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. ఇన్నోవా వాహనంలో హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ సారథ్యంలో వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి పర్యవేక్షణలో హయత్నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, డీఐ నిరంజన్తో కూడిన బృందం గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఓఆర్ఆర్, పెద్ద అంబర్పేట వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే ఇన్నోవాలో 25 బ్యాగ్లలో ప్యాక్ చేసిన 450 గ్రాముల గంజాయి పట్టుబడింది. ఈ మేరకు బాబూమీయా, షేక్ యజాజ్ సికిందర్ను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.
రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్దనుంచి 228 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జగదీశ్వర్రెడ్డి వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన సయ్యద్ షరీఫ్ ఖాన్, మహ్మద్ ఆథిల్, సమీర్ కలిసి గంజాయి దందా చేస్తున్నారు. వీరిలో ఇద్దరు రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు కారులో గంజాయిని తరలిస్తున్నట్లు విశ్వనీయంగా తెలిసింది. దీంతో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు శంకర్పల్లి బీడీఎల్ ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా షరీఫ్, ఆథిల్ ప్రయాణిస్తున్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా.. గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్దనుంచి వాహనంతోపాటు 228 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. సమీర్ అనే వ్యక్తి ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి రాజమండ్రిలో తమకు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కేసులో సమీర్ పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.