సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): “మా ఇంట్లో భారీ చోరీ జరిగింది. దేశంలోని వివిధ నగరాలలో ఉన్న మా బంధువులలో చర్చ జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే హైదరాబాద్ పోలీసులు స్పందించారు. నేను ఊహించని విధంగా 10 రోజుల్లోనే దొంగల ముఠాను పట్టుకున్నారు. పోయిన సొత్తును రికవరీ చేశారు. హ్యాట్సాఫ్ టూ తెలంగాణ పోలీస్”.. అంటూ బాధితుడు రాహుల్ గోయెల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలోనే తెలంగాణ బెస్ట్ పోలీస్.. అని కొనియాడారు. ఇది తన మాటే కాదని.. ఇతర రాష్ర్టాల్లో ఉంటున్న తన బంధువులు కూడా అంటున్నారన్నారు.
బ్యాచ్ అధికారుల సహాయంతో..
నేపాలీ గ్యాంగ్ల దొంగతనం తీరును గుర్తించిన హైదరాబాద్ పోలీసులు, దొంగసొత్తు దేశ సరిహద్దులు దాటకుండా జాగ్రత్త పడ్డారు. ఇందులో భాగంగానే నగరంలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులు తమ బ్యాచ్ అధికారుల సహాయం తీసుకొని ఈ కేసు మిస్టరీ ఛేదించారు. నేపాలీ గ్యాంగ్ల తీరుపై ఉన్న అవగాహనతో తొలుత నగర పోలీసులు దేశ సరిహద్దులపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. 13 మంది ఉన్న ఈ ముఠా సభ్యులు పోలీసులకు చిక్కకుండా మూడు బృందాలుగా వీడిపోయినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించి, బార్డర్లో నిఘా పెంచారు. సరిహద్దులోని ఎస్ఎస్బీ సహకారంతో నిఘాను పెంచిన నగర పోలీసులు.. ప్రధాన నిందితుడితో సహా తొలుత ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో మరో ఏడుగుర్ని అరెస్టు చేశారు. ఐదుకోట్ల విలువజేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
సమన్వయంతో..
నార్త్జోన్ డీసీపీ చందనా దీప్తి, టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు శ్రీనాథ్రెడ్డి, లింగేశ్వర్రావు, శ్రీకాంత్, అంజయ్య, ఎస్సైలు అశోక్రెడ్డి, జ్ఞాన్దీప్, అవినాష్ బాబు, లక్ష్మీనారాయణతో కూడిన బృందాలు నేరస్థుల వేటలో రంగంలోకి దిగాయి. నేరస్థులకు సంబంధించిన ఆధారాలతో దేశ సరిహద్దుల్లో, ఇతర రాష్ర్టాలలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు బృందాలు సమన్వయంతో ముందుకువెళ్తూ.. సమాచారాన్ని ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దొంగలు దేశం విడిచి పారిపోకుండా కట్టడి చేశారు.
ఈ దీపక్ సరిహద్దు దాటిస్తాడు..
భారత్లో దొంగతనాలు చేసిన నేరగాళ్లను దేశ సరిహద్దులు దాటించే బాధ్యతను దీపక్ అనే వ్యక్తి తీసుకున్నాడు. నేరగాళ్లు సరిహద్దుల్లోకి రాగానే వారిని సునాయసంగా అవతలికి తీసుకువెళ్లే బాధ్యతను దీపక్ తీసుకున్నాడు. అయితే, దీపక్ నిందితుల కోసం ఎదురు చూశాడు. సమయానికి నిందితులు వెళ్లకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటికే పోలీసులు ప్రధాన నిందితులపై నిఘాపెట్టి వెంబడిస్తూ వెళ్లారు. ఈ క్రమంలోనే కమల్, పార్వతి, సునీల్చౌదరీ, లాల్సింగ్ తప్ప, మోహన్ సౌద్, విశాల్ సౌద్, వికాస్ సౌద్, బ్రిజేశ్, బర్షనాథ్, వినోద్కుమార్ను అరెస్ట్ చేశారు.
భరత్ బిస్త్ కీలకం
పరారీలో ఉన్న భరత్ బిస్త్ ఈ కేసులో కీలకంగా మారాడు. నిందితులు పిలువగానే వెంటనే బెంగళూర్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న బిస్త్.. వెంటనే దొంగతనంలో కీలకమైన తాళాలు పగులగొట్టే బాధ్యతను తీసుకొని, విజయవంతంగా పూర్తిచేశాడు. దొంగిలించిన సొమ్ములో కొంత తీసుకొని ఇక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, ఇంటి తాళాలు పగులగొట్టడంలో బిస్త్కు ప్రవీణ్యం ఉండటంతో గతంలో ఎన్ని ఇండ్లకు కన్నం వేశాడనే విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బిస్త్ కోసం దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలలో నిఘా పెట్టినట్టు పోలీసులు తెలిపారు.