గడిచిన 9 ఏండ్లలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని పురోభివృద్ధే ధ్యేయంగా అన్ని రంగాల్లో తీర్చిదిద్ది ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించాం. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నూటికి 100% పూర్తి చేశాం. ప్రజల సమస్యలకు సీఎం కేసీఆర్ సారథ్యంలో శాశ్వత పరిష్కారాలు చూపాను. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా మల్చి ఘన కీర్తిని ఆర్జించాం. నియోజకవర్గాన్ని ఆరు వేల కోట్ల వ్యయంతో అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాన్ని అందించి ప్రతి కుటుంబాన్ని ప్రగతి బాటలో నడిపించాం. 100 రోజుల ఎమ్మెల్యే పర్యటనలో చేపట్టిన ప్రగతి యాత్రకు ప్రతి కాలనీల్లో అభివృద్ధిని చూసి ప్రజలు పువ్వులు చల్లి, హారతులతో స్వాగతించారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపునకు ప్రజలు జేజేలు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రత్యేకంగా మాట్లాడారు.
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 1 ;నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అడుగు జాడల్లో పయనించాం. నియోజకవర్గానికి
సంబంధించి, ప్రజల సాధక, బాధకాలను తెలుసుకొని మౌలిక వసతుల కల్పనకు దాదాపు ఆరువేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. స్థానికంగా విద్యా, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనపై పెద్ద మొత్తంలో దృష్టి సారించాం.ఆ దిశగానే గతమెన్నడూ ఎరగని అభివృద్ధిని సాధించాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ ఖాయం. ప్రభుత్వ సంక్షేమ పథకాలే.. మన గెలుపు గుర్రాలు.
ప్రజల ప్రధాన సమస్య.. తాగునీటిని అందించాం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లను మిషన్ భగీరథ పథకం ద్వారా అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆరు పెద్ద రిజర్వాయర్లతో సుమారు రూ.654 కోట్ల వ్యయంతో ప్రతి ఇంటికి తాగునీటిని అందించాం. సమైఖ్యాంద్ర పాలనలో 15 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి. కాలాలతో సంబంధం లేకుండా గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు తండ్లాడుకునేటోళ్లు. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా మహిళలు నీటి ట్యాంకర్ల వద్ద క్యూలైన్లో వేచి ఉండి అప్పటి మట్టుకు సరిపోయే బిందెడు నీళ్లు దొరకాలంటే నరకయాతన పడేవారు. కాని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రోజు విడిచి రోజు పుష్కలంగా శుద్ధమైన తాగునీటిని నేరుగా ఇంట్లోకే అందిస్తున్నాం. జంట సర్కిళ్ల పరిధిలో రూ.220 కోట్ల వ్యయంతో 402 కిలోమీటర్ల పైపులైన్ పనులు చేపట్టి ఆరు రిజర్వాయర్లు నిర్మించాం. వీటిలో 2.41కోట్ల లీటర్ల సామర్థ్యంతో నీటిని నిల్వచేస్తూ కాలనీలు, బస్తీలకు సరఫరా చేస్తున్నాం. నిజాంపేట కార్పొరేషన్, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీల పరిధిలో రూ.190 కోట్ల వ్యయంతో 29 వాటర్ ట్యాంకులు కొన్ని పూర్తవ్వగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. 3.27ఎంజీడీ నుంచి 1.24 కోట్ల లీటర్ల సామర్థ్యంతో నీటిని నిల్వచేస్తూ సరఫరా చేస్తున్నాం.
విద్యకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చాం
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు నియోజకవర్గంలో విద్యకు మొదటి ప్రాధాన్యతను కల్పించాం. గండి మైసమ్మలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం పూర్తై తరగతులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా కుత్బుల్లాపూర్లో 100 ఎంబీబీఎస్ సీట్ల కెపాసిటీతో మెడికల్ కళాశాలను మంజూరు చేయించుకున్నాం. జగద్గిరిగుట్టలోని హెచ్ఎండీఏ 20 ఎకరాల స్థలంలో త్వరలో నిర్మించుకునేందుకు ప్రభుత్వం జీఓను విడుదల చేసింది. దీంతో పాటుగా ఒకేషనల్ జూనియర్ కళాశాలకు మా తండ్రి కేఎం పాండు ట్రస్టు పేరిట రూ. కోటిన్నర విరాళంతో భవనాన్ని పూర్తి చేసి అందించాను. కుత్బుల్లాపూర్కు డిగ్రీ కళాశాల మంజూరైంది. వచ్చే విద్యా సంవత్సరంలో డిగ్రీ కళాశాల తరగతులను తాత్కలిక భవనంలో ప్రారంభించడంతో శాశ్వత భవన నిర్మాణాన్ని చేపట్టేలా తగు చర్యలు తీసుకుంటున్నాం. హెచ్ఎంటీలో ఐదు ఎకరాల స్థల సేకరణ పూర్తి చేశాం. కుత్బుల్లాపూర్ విలేజ్లో ఉన్న హైస్కూల్కు మా కుటుంబ పేరిట నూతన భవనాన్ని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం దానిలో నడిచే తరగతులను తాత్కలికంగా వేరే భవనానికి మార్చేలా చూస్తున్నాం.
అన్ని రంగాల్లో 99% అభివృద్ధి సాధించాం
నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి 99 శాతం సాధించాం. వీటిలో ప్రధానంగా మంచినీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, ఎస్ఎన్డీపీ నాలాల ద్వారా ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం. ఫ్లై ఓవర్లు, అంతర్గత లింక్ రోడ్లు, చెరువుల అభివృద్ధి, ప్రజలకు సుస్థిరమైన పరిపాలన అందించేందుకు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వందల కోట్ల సంక్షేమాన్ని ప్రజలకు అందించాం. ప్రధానంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించడంతో పాటు వారికి ఆర్ధికంగా వెన్నంటూ ఉంటూ వారికి కుటుంబాల్లో మనోధైర్యాన్ని నింపేందుకు సీఎం సహాయనిధి వందల కుటుంబాలకు ఆర్ధిక భరోసాను కల్పించడం ఎంతో సంతృప్తినిచ్చింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పేదలకు నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉండేందుకు ప్రతి 10 వేల కుటుంబాలకు ఒక బస్తీ దవాఖానను అందించాలనే సంకల్పంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 20 బస్తీ దవఖానాలను ఏర్పాటు చేసుకున్నాం. కాగా అదనంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కృషితో గాగిళ్లాపూర్లో ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం.
రోడ్ల విస్తరణ.. మైదానాల అభివృద్ధి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఉన్న రోడ్లను విస్తరణ చేపట్టడంతో పాటు లింకు రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. ఇందుకు సుమారు వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా బాలానగర్ బ్రిడ్జీ నిర్మాణంతో పాటు ఐడీపీఎల్ జంక్షన్, నిజాంపేట్, బాచుపల్లి ైప్లెఓవర్లతో పాటు సుచిత్రా నుంచి కొంపల్లి వరకు ఫ్లై ఓవర్లు, గాజుల రామారం చౌరస్తా, సూరారం చౌరస్తాలలో జంక్షన్లతో పాటు మల్లంపేట్లోని ఓఆర్ఆర్ ఎంట్రీ, ఎగ్జిట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. భవిష్యత్లో నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు మెరుగైన రోడ్ల విస్తరణ జరిగేలా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. క్రీడల్లో ఇక్కడి యువతకు ప్రత్యేకంగా అవకాశాలు కల్పించేందుకు వందల కోట్ల వ్యయంతో స్టేడియం నిర్మాణాలతో పాటు ప్రతి కాలనీలో పార్కులు, అందులో క్రీడా సామగ్రితో పాటు ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్లు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రత్యేక ప్రాధాన్యతతో అభివృద్ధి చేస్తున్నాం. సుభాష్నగర్ డివిజన్ అపురూప కాలనీలో రూ.2 కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. సూరారం డివిజన్ టీఎస్ఐఐసీ కాలనీలో స్పోర్ట్ క్లబ్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాం. గండి మైసమ్మలో జ్యోతిరావు పూలే ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.
ప్రజల అండే.. ఆసరాగా గెలుపు
ప్రతి పక్షాలు లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ పబ్బం గడపాలని చూస్తున్నాయి. వారి మాటలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నియోజక వర్గంలో నేను ప్రత్యేకంగా చేపడుతున్న ప్రగతి యాత్రలో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రజలంతా నా పరిపాలన పట్ల సంతోషంగా ఉన్నారు. చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలే బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి మూడోసారి గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇదే స్ఫూర్తితో ఎన్నికల్లో అత్యధిక మెజార్టీని సాధించి సీఎం కేసీఆర్కు గిఫ్ట్గా నిలిచేందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేసేందుకు కంకణం కట్టుకున్నారు.