సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : మీ వాహనం రిజిస్ట్రేషన్ చేసి 15 ఏండ్లు నిండిందా? గడువు ముగిసినా రోడెక్కుతున్నారా? అయితే జరభద్రం. నగరంలో ఆర్టీఏ అధికారులు ప్రత్యేక డ్రైవ్తో 15 ఏండ్లు నిండిన వాహనాలను వినియోగిస్తున్నవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 15 ఏండ్లు నిండిన వాహనాలతో కాలుష్యం తీవ్రత అధికంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో నగరంలో చాలా మంది 15 ఏండ్లు నిండిన వాహనాలను రెన్యూవల్ చేయించుకోకుండా వినియోగిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా 15 ఏండ్ల కాలపరిమితిని కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్ణయించింది. అయితే వాహన సామర్థ్యాన్ని బట్టి మరో 5 ఏండ్లు రెన్యూవల్కు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ద్విచక్ర, ఫోర్ వీలర్ వాహనాలకు గ్రీన్ ట్యాక్సీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 15 ఏండ్లు నిండిన ద్విచక్ర వాహనానికి సాధారణ ఫీజు 14 32 ఉంటుంది. దీంతో పాటు గ్రీన్ ట్యాక్సీ 2వేలు చెల్లించాలి.
గడువు ముగిసిన రోజులకు అంటే నెలకు రూ.300 చెల్లించాలి. ఈ మొత్తం ఫీజు మీసేవలో సంబంధిత ఆర్సీతో చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆధార్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఆర్సీ తదితర పత్రాలతో ఆర్టీఓ కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. అనంతరం ఆ వాహనం మరో ఐదేండ్లు వినియోగించడానికి అనుమతి లభిస్తుంది. ఇదే లెక్కన 15 ఏండ్లు నిండిన ఫోర్ వీలర్ అయితే సాధారణ ఫీజు రూ.5,835తో పాటు గ్రీన్ ట్యాక్సీ రూ.5వేలు ఉంటుంది. గడువు ముగిసిన పెనాల్టీ అంటే నెలకు రూ.500 ఉంటుంది. ఈ మొత్తం ఫీజును మీ సేవలో చెల్లించి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫోర్ వీలర్ 20 ఏండ్లు వినియోగించి ఉంటే గ్రీన్ ట్యాక్సీ రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. దీంతో మరో ఐదేండ్ల వరకు వాహనం వినియోగించే వీలు ఉంటుందని వివరించారు. గ్రేటర్లో 15 ఏండ్లు గడువు ముగిసిన వాహనాలను వెంటనే రెన్యూవల్ చేయించుకోవాలంటూ అధికారులు సూచించారు.