సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ) : రద్దీ రూట్లను సాకుగా చూపి రెట్టింపు రైడ్ ధరలు వసూలు చేసే వాహన ఆధారిత యాప్లు.. ఇప్పుడు ఇంధన ధరలు పెంపు ప్రభావంతో సామాన్య ప్రయాణికుల నడ్డీ విరుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెరగడంతో ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర యాప్లు రైడ్ ధరలను పెంచేశాయి. రైడ్ బుక్ చేస్తే చార్జీ గిట్టుబాటు అయితేనే యాప్ డ్రైవర్లు ట్రిప్ ఓకే చేస్తున్నారు. రూ.60తో పూర్తయ్యే ట్రిప్ 80 వరకు చూపిస్తుందని ప్రయాణికులు చెబుతున్నారు.
ఇక ఆటో, కారు ధరలు రెట్టింపు చూపిస్తున్నాయని తెలిపారు. ఓవైపు ఇంధన కొరత మరోవైపు ధరల పెంపుతో తమ ఉపాది గడవడం కూడా కష్టంగానే మారిందని, ఛార్జీలు పెంచితే కానీ గిట్టుబాటు కాదని యాస్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఈఎంఐలు చెల్లించడం కష్టమవుతుందని డ్రైవర్లు వాపోతున్నారు. తమ నష్టాన్ని ప్రయాణికులపై వేయాల్సిన పరిస్థితి తప్పదని అన్నారు. కాగా, వాహన ఆధారిత యాప్లపై ఆధారపడే ప్రయాణికులకు రైడ్ ఛార్జీలు తడిసిమోపెడవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ నుంచి వివిధ మార్గాలకు వెళ్లడానికి ట్రాఫిక్ సమస్యతో పాటు ఇంధన ధర పెంపుతో 200 రూపాయల ఛార్జీ ఇప్పుడు 300పైగానే చూపిస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు. పెరగిన ఒక్క రోజులోనే ధరల్లో మార్పు కనిపిస్తుందని అన్నారు. ఇంధన ధరలు తగ్గించకపోతే సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతున్నారు.
సర్వీస్ చార్జీలు పెంచండి..!
అమెజాన్, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి ఫ్లాట్ఫాం కంపెనీల డెలివరీ బాయ్స్ సైతం పెరిగిన ఇంధన ధరల కారణంగా ఛార్జీలు పెంచాలని సంబంధిత సంస్థలకు దరఖాస్తులు ఇచ్చారు. పెట్రోల్ ధరలు పెరగడం కారణంగా తమకు వస్తున్న కమీషన్స్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ కారణంగా గమ్య స్థానాలకు చేరుకోవడం ఇంధన వినియోగం పెరుగుతుందని డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. ఇంధనం అయిపోతే మళ్లీ ఫిల్ చేసుకోవాలంటే గంటల తరబడి బంక్ల వద్ద ఎదురుచూడాల్సి వస్తుందని తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో తాము సేవలందించాలంటే తమకు గిట్టుబాటు ధర కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. గిగ్ ఫ్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేల్ సలావుద్దిన్ మాట్లాడుతూ.. పెరిగిన ఇంధన ధరల కారణంగా డెలివరీబాయ్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కంపెనీలు డెలివరీ బాయ్స్ శ్రమ దోచుకుంటున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు పెంచి చేతులు దులుపుకున్నదని దాని పర్యావసనాలు సామాన్యులను బలి తీసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్స్కు ఛార్జీలు పెంచి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.