సిటీబ్యూరో, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ): మహిళలను వేధించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ హెచ్చరించారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో గురువారం ఈవ్ టీజర్లకు నిర్వహించిన కౌన్సిలింగ్ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఆకతాయిలు, గృహహింస, పని ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్న మహిళలను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఆడపిల్లల భద్రతకు షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
రాచకొండ పోలీసులు 24/7 అందుబాటులో ఉంటారన్నారు. ఆకతాయి పనులు చేసి పట్టుబడ్డ వారు, కౌన్సిలింగ్ ద్వారా చెడు ప్రవర్తనను మార్చుకొని, తిరిగి బాధ్యత గల పౌరులుగా మారే అవకాశం కల్పిస్తున్నామన్నారు. షీ టీమ్స్ గత రెండు నెలల్లో 118 ఈవ్ టీజర్లను పట్టుకోగా.. అందులో 33 ఎఫ్ఐఆర్లు, 41 పెట్టీ కేసులు, 44 కౌన్సిలింగ్ కేసులు నమోదు చేసి, 247 మంది ఆకతాయిలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, రోడ్డు సేఫ్టీ డీసీపీ శ్రీబాల, ట్రాఫిక్ డీసీపీ డి. శ్రీనివాస్, ఏసీపీ శ్రీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.