సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ): మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్బాబు హెచ్చరించారు. మహిళలను వేధించి పట్టుబడే వారి ప్రవర్తనపై ఆరు నెలల పాటు ప్రత్యేక నిఘా కొనసాగిస్తామంటూ.. ఇందుకు సంబంధించిన ‘మహిళా సంరక్షణ నిఘా రిజిస్టర్’ను సీపీ శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను వివిధ రకాలుగా వేధించే నిందితులు ఒకసారి అరెస్టయిన తరువాత బాధితులపై కక్ష్య పూరిత వేధింపులు, దాడులు చేయకుండా ఉండేందుకు వారి ప్రవర్తన, వారి రోజు వారీ కార్యకలాపాలపై మహిళా సంరక్షణ నిఘా రిజిస్టర్ ద్వారా నిఘా ఉంటుందన్నారు. ఈ రిజిస్టర్లో గతంలో లైంగిక నేరాలకు పాల్పడిన నేరస్తులు మళ్లీ అలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండేలా నిఘా పెడుతామన్నారు.
ఆకతాయిలకు కౌన్సెలింగ్
రాచకొండ పరిధిలో షీ టీమ్స్కు పట్టుబడ్డ 118 మందికి వారి తల్లిదండ్రుల సమక్షంలో ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. బస్టాండ్లు, రైల్వే, మెట్రో స్టేషన్లు, విద్యా కేంద్రాలు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో పోకిరీల చేష్టలను కట్టడి చేసేందుకు డెకాయి ఆపరేషన్లు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.
వీరితో పాటు ప్రేమ పేరుతో, ఉద్యోగాలిప్పిస్తామంటూ, మద్యం మత్తులో వేధింపులు చేసే వారిపై వచ్చిన ఫిర్యాదులతో ఆయా పోలీస్స్టేషన్లలో నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. షీ టీమ్స్కు సమాచారం అందగానే బాల్య వివాహాలను నిలిపేస్తున్నామని, హయత్నగర్లో ఇటీవల ఒక బాల్య వివాహాన్ని ఆపేసినట్లు తెలిపారు. ఈ నెల పదిహేను రోజుల్లో సుమారు 9700 మందికి 60 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, మహిళా చట్టాలు, వారి హక్కులు, నేరాలపై అవగాహన కల్పిస్తూ మీ కోసం షీ టీమ్స్ ఉన్నాయంటూ భరోసా ఇచ్చామన్నారు.
షీ టీమ్స్కు చిక్కిన 39 మంది
హైదరాబాద్ షీ టీమ్స్ ఈవ్టీజింగ్ పాల్పడుతున్న 39 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు మహిళా భద్రత డీసీపీ కవిత తెలిపారు. ఎగ్జిబిషన్, నాంపల్లి, చార్మినార్, అఫ్జల్గంజ్ బస్స్టాప్, పరేడ్ గ్రౌండ్, కైట్ ఫెస్టివల్, పీపుల్స్ ప్లాజా తదితర ప్రాంతాల్లో షీ టీమ్స్ ఈవ్టీజర్లను పట్టుకుందన్నారు. ఇందులో 10 కేసుల్లో నిందితులకు మూడు రోజులు శిక్షలు, రూ. 250 జరిమానా విధించగా, మరో మూడు కేసుల్లో న్యాయస్థానం వార్నింగ్ ఇచ్చిందన్నారు.