Crime News | బంజారాహిల్స్: నరదృష్టి పోగొట్టే పూజలు చేస్తామంటూ.. ఓ మహిళను నమ్మించి నగదుతో ఉడాయించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రోడ్ నం. 7లో ఉంటున్న ఓ మహిళ ఇంటికి శుక్రవారం ఇద్దరు మహిళలు వచ్చారు. తాము రోడ్ నం. 4లోని ఎల్లమ్మ ఆలయం నుంచి వచ్చామని, ఆలయం కోసం చందా ఇవ్వాలని కోరారు. దీంతో కొంత డబ్బును చందాగా ఇచ్చిన సదరు మహిళతో మాటలు కలిపిన ఆ ఇద్దరు మహిళలు.. ‘మీకు నరదృష్టి చాలా ఎక్కువగా ఉంది.
దాన్ని తొలగించాలంటే నిమ్మకాయలు, ఎండుమిర్చి, ఉప్పు, బియ్యంతో పాటు ఇంట్లోంచి లక్ష రూపాయల నగదు బ్యాగ్లో పెట్టుకుని రావాలి’ అంటూ..సూచించారు. దీంతో ఆమె రూ.70వేల నగదుతో పాటు ఇతర సామగ్రిని బ్యాగులో పెట్టారు. పూజ చేసినట్లు నటించిన ఇద్దరు..బ్యాగులో ఉన్న వస్తువులను మరుసటిరోజు తెరిచి చూడాలని, అప్పటిలోగా నరదృష్టి మొత్తం పోతుందని చెప్పి వెళ్లిపోయారు. కాసేపటికి అనుమానం వచ్చి బ్యాగ్ తెరిచి చూడగా, డబ్బులు కనిపించలేదు. అన్ని ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టారు.