నగరంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర వైభవంగా సాగింది. ‘రామ లక్ష్మణ జానకీ..జై బోలో హనుమాన్కీ’.. నినాదాలతో నగరం హోరెత్తింది. బంజారాహిల్స్లోని హరేకృష్ణ స్వర్ణ దేవాలయంలో కొలువైన అభయాంజనేయ స్వామికి పంచామృత అభిషేకంతో పాటు విశేష అలంకరణ, హారతి, పుష్పాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : నగరంలో హనుమాన్ జన్మదిన విజయయాత్ర ప్రశాంత వాతావరణంలో వైభవంగా జరిగింది. రాచకొండ పరిధిలోని కర్మన్ఘాట్ దేవాలయం నుంచి ప్రారంభమైన హనుమాన్ ర్యాలీ, నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గౌలిగూడకు చేరుకొని అక్కడి నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చిన్న చిన్న ర్యాలీలను కలుపుకుంటూ రాత్రి 9 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్లోని తాడ్బండ్ హనుమాన్ ఆలయానికి చేరుకున్నది.
ట్రై పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్రలు ఆయా కమిషనరేట్ల పరిధిలోని ర్యాలీలు సాఫీగా సాగేవిధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ క్షేత్ర స్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బషీర్బాగ్లోని పాత కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) నుంచి, అలాగే క్షేత్ర స్థాయిలో తిరుగుతూ ర్యాలీని పర్యవేక్షించారు.
మధ్యాహ్నం నారాయణగూడ ప్రాంతానికి ర్యాలీ చేరిన సమయంలో భారీ వర్షం కురవడంతో ర్యాలీ ముందుకు సాగడంలో కొంత అంతరాయం నెలకొంది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ అందరి సహకారంతో హనుమాన్ జయంతి యాత్ర ప్రశాంతంగా జరిగిందన్నారు. శోభాయాత్రకు 10 వేల మంది బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ర్యాలీలు తాడ్బండ్ చేరుకోవడంతో పాటు ర్యాలీలో పాల్గొన్న వారు తిరిగి ఇండ్లకు చేరుకునే వరకు బందోబస్తును నిర్వహించామన్నారు.
ర్యాలీ జరిగే రూట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఈ సారి డ్రోన్ కెమెరాలతో బందోబస్తును నిరంతరం పర్యవేక్షించామన్నారు. శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని, హనుమాన్ యాత్రలో అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు ముందస్తుగా అరెస్ట్ చేశామని వెల్లడించారు.
రాచకొండ పరిధిలో..
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రశాంతమైన వాతావారణంలో హనుమాన్ జయంతి వేడుకలు పూర్తయ్యాయయని కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. సరూర్నగర్ చెరువు కట్ట వద్ద జరుగుతున్న వేడుకలను స్వయంగా ఆయన పరిశీలించి, బందోబస్తు ఏర్పాట్లను తనిఖీ చేశారు. ప్రశాంతంగా వేడుకలు జరగడంలో ప్రజలు, నిర్వాహకులు సహకరించారని సీపీ తెలిపారు.
సీసీసీ నుంచి పర్యవేక్షణ
సైబరాబాద్ పరిధిలో విజయోత్సవ ర్యాలీలు ప్రశాంతంగా ముగిశాయని సీపీ స్టీఫెన్ రవీంధ్ర తెలిపారు. ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ర్యాలీలను పర్యవేక్షిస్తూ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉన్నామన్నారు. సోషల్మీడియాపై నిఘా ఉంచామని, పుకార్లకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని చెప్పారు.
శోభాయాత్రలో మేయర్
హనుమాన్ జన్మదినం సందర్భంగా నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్, శ్రీరాంనగర్, ఉదయ్నగర్, యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్లో పూజలు నిర్వహించారు. పలు అసోసియేషన్లు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. అనంతరం కృష్ణానగర్లో భాగ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభయాత్రలో పాల్గొనగా, ఆలయ ధర్మకర్తలు మేయర్ను శాలువాతో సన్మానించారు.