ఉస్మానియా యూనివర్సిటీ : కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర వివక్ష ప్రదర్శించారని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ మండిపడ్డారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. కేంద్ర వైఖరికి నిరసనగా గెల్లు శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి, మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గెల్లు మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థులు, విద్యారంగంపై కేంద్రం శీతకన్ను ప్రదర్శించిందని దుయ్యబట్టారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తామని చెప్పుకుంటున్న వన్ క్లాస్ వన్ ఛానల్ కార్యక్రమంలో కేవలం ఎగువ మధ్య తరగతి విద్యార్థులకే ఉపయోగపడుతుందని అన్నారు.
దీంతో నిరుపేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిని తక్షణమే వెనక్కి తీసుకుని, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఫెలోషిప్లు పెంచాలని అన్నారు. విభజన చట్టంలో స్పష్టంగా ప్రకటించిన గిరిజన యూనివర్సిటీతో పాటు ఇతర విద్యారంగ సంస్థలను నేటికీ ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రాల సమాఖ్యగా భారతదేశాన్ని రాజ్యాంగంలో పేర్కొన్నారని, కానీ దానిని కావాలనే కేంద్రప్రభుత్వం తన పెత్తనం ఉండేలా చూస్తోందని మండిపడ్డారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంపై కక్షపూరితంగా ఒక వైద్య కళాశాల కూడా మంజూరు చేయలేదని గుర్తు చేశారు. విద్యార్థుల పట్ల మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులకు ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు ఉచితంగా అందజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, కిరణ్గౌడ్, జంగం అవినాశ్, కోతి విజయ్, నాయకులు పడాల సతీశ్, రఘురాం, వీరబాబు, శ్రీకుమార్, కరుణాకర్రెడ్డి, కృష్ణ, వేల్పుకొండ వెంకట్, సిగ వెంకటేశ్, నవీన్గౌడ్, మంద సురేశ్, మేకల రవి, జంగయ్య, కాట శివ, కాదశి రవి, శ్రీనునాయక్, ప్రశాంత్, మిద్దె సురేశ్, చంద్రకాంత్, ప్రవీణ్చారి, మూర్తి నాయుడు, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.