మహేశ్వరంలోని దవాఖాన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి
ప్రజా శ్రేయస్సు కోసమే లాక్డౌన్
ఇబ్బందులు పడకూడదని నాలుగు గంటల సడలింపు
కరోనా పాజిటివ్ వచ్చిన వారు భయాందోళనకు గురికావొద్దు
సర్కారు దవాఖానల్లోమెరుగైన వైద్యం
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
కొవిడ్ నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్ష
రంగారెడ్డి, మే 15,(నమస్తే తెలంగాణ): కరోనా బారినపడి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోకుండా సీఎం కేసీఆర్ నాయకత్వంలో శక్తి వంచన లేకుండా పని చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తన కార్యాలయంలో కొవిడ్ నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ దవాఖానలోని వార్డుల్లో పర్యటించి రోగులను పరామర్శించారు. వారికి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలు కరోనా బారిన పడకుండా ఎప్పటికప్పుడు నియంత్రణ చర్యలు పాటిస్తున్నామన్నారు. బాధితులకు చికిత్స అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఫీవర్ సర్వేలో భాగంగా ఇంటింటికీ వైద్య బృందాలు వెళ్లి లక్షణాలు ఉన్న వారిని గుర్తించిన వెంటనే వారికి కావాల్సిన మందులు ఇస్తున్నారన్నారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, నియంత్రణ చర్యలు కూడా అమలుచేయాలని కోరారు. దవాఖానకు వచ్చిన కరోనా రోగులకు సరైన సమయంలో మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. అత్యవసరమైన రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మందులు స్టాక్ ఉండేలా మానిటర్ చేస్తున్నామన్నారు. నిబంధనల మేరకు వ్యాక్సిన్ వేసేలా ప్రతిరోజు నివేదికలు తెప్పించుకుని పర్యవేక్షిస్తున్నామన్నారు. లాక్డౌన్కు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ నాలుగు గంటల పాటు వెసులుబాటు కల్పించారన్నారు. రైతులు పండించిన కూరగాయలను నగరానికి తీసుకెళ్లి విక్రయించకుండా స్థానికంగానే అమ్మే విధంగా మార్కెటింగ్ శాఖ అధికారులు చూడాలన్నారు. మహేశ్వరం దవాఖానలో ప్రస్తుతం చేస్తున్న కరోనా పరీక్షలను నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించాలని ఆదేశించారు. రూ.4కోట్లతో నిర్మాణంలో ఉన్న దవాఖాన భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నెలన్నరగా మండలంలో 3478 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 493 మందికి పాజిటివ్ వచ్చిందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 8749 డోసు ల వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. ఫీవర్ సర్వేలో 9827 కుటుంబాలకు పరీక్షలు నిర్వహించగా 220 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించారని, వారికి మందులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మహేశ్వరం ఎంపీ పీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత, తాసిల్దార్ జ్యోతి, ఇన్స్పెక్టర్ మధుసూదన్, దవాఖాన ఇన్చార్జి డాక్టర్ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.