మారేడ్పల్లి, ఫిబ్రవరి 12 : మోండా డివిజన్ మారేడ్పల్లిలోని నెహ్రూనగర్ పార్కు ఆవరణలో రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న దంగల్స్(కుస్తీ), జిమ్ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న ఈ భవనాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొన్ని కారణాల వల్లన ఈ భవన నిర్మాణ పనులు ఆలస్యం కాగా, ఎమ్మెల్యే జి.సాయన్న పలుమార్లు ఈ భవనాన్ని పరిశీలించారు. దంగల్స్(కుస్తీ), భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. 80 శాతం మేరకు నిర్మాణ పనులు పూర్తి కాగా.. 20 శాతం మేరకు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఏకైన దంగల్స్, జిమ్ భవనం కంటోన్మెంట్ నియోజకవర్గంలోనే మొదటిది.
త్వరలో జిమ్, దంగల్స్ భవనంలో సకల సౌకర్యాలు
సూమారు రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనంలో జిమ్, దంగల్స్(కుస్తీ) అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేయనున్నారు. వివిధ రాష్ర్టాల నుంచి నాణ్యమైన పరికరాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. సుమారు రెండు నెలల అనంతరం దంగల్స్, జిమ్ భవనాలు ఉపయోగంలోకి రానున్నాయి. స్థానిక ఎమ్మెల్యే జి.సాయన్న ఎప్పటికప్పుడు భవన నిర్మాణ పనులను పరిశీలిస్తూ.. పనులను వేగవంతం పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. మొదటి దశలో 1 కోటి 50 లక్షల నిధులు మంజూరు చేయగా, ఈ నిధులు సరిపోకపోవడంతో మరో కోటిని మంజూరు చేయడం జరిగింది. దీంతో భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
త్వరలో ప్రారంభిస్తాం..
నెహ్రూనగర్ పార్కు ఆవరణలో రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న దంగల్స్ (కుస్తీ), జిమ్ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. లోపల, బయట భాగంలో పెయింటింగ్ పనులు పూర్తయ్యాయి. మరో నెలలో దంగల్స్, జిమ్ సంబంధించిన పరికరాలు తీసుకవచ్చి బిగించనున్నట్లు తెలిపారు. దీంతోపాటు ఈ భవనం పక్కనే ఉన్న చిల్ట్రన్స్ పార్కును కూడా 50 లక్షలతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
– రవీందర్, ఏఈ, జీహెచ్ఎంసీ