హైదరాబాద్ నగరాన్ని హరితనగరాన్ని తీర్చిదిద్దడమే కాకుండా నగరవాసుల ఆరోగ్యానికి జీహెచ్ఎంసీ పెద్దపీట వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆహ్లాదకర వాతావరణంలో ఆరోగ్య ధీమా కల్పించేందుకు జీహెచ్ఎంసీ అర్బన్ బయో డైవర్శిటీ విభాగం ప్రత్యేక థీమ్ బేస్డ్ పార్కులను తీర్చిదిద్దుతున్నది. ఈ క్రమంలో కేపీహెచ్బీ కాలనీ ఫేజ్-4 లోథా రోడ్లో జిమ్ బేస్డ్ థీమ్ పార్కును అభివృద్ధి చేసింది. దాదాపు రూ. 2కోట్లతో తీర్చిదిద్దిన ఈ పార్కును త్వరలోనే ప్రారంభిస్తామని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి. మమత తెలిపారు.
సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) ;ఒకప్పటి హైదరాబాద్ వేరు.. ప్రస్తుత హైదరాబాద్ మహానగరం వేరు. నగర జనాభా లక్షలు దాటి కోట్లకు పరుగులు పెడుతుండటంతో భాగ్యనగరం రోజురోజుకు విస్తరిస్తూనే ఉన్నది. దీంతో జీహెచ్ఎంసీ కూడా అందుకు తగ్గట్లుగా మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఉరుకుల పరుగుల జీవితంలో నగర ప్రజలకు కాస్త రిలీఫ్ను ఇచ్చేందుకు అందమైన పార్కులను తీర్చిదిద్దుతున్నది. దీంతో భాగ్యనగరం సరికొత్త అందాలతో అలరారుతున్నది. నగరంలోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తున్న థీమ్ పార్కులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
హైదరాబాద్ నగరాన్ని ఆకుపచ్చ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఓ వైపు హరితహారం కొనసాగుతుండగా.. మరో వైపు కాలనీలు, బస్తీల ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో సేద తీరేలా జీహెచ్ఎంసీ అర్బన్ బయో డైవర్సిటీ విభాగం ప్రత్యేక థీమ్ బేస్డ్ పార్కులను తీర్చిదిద్దుతున్నది. వినోదంతో పాటు పచ్చదనం అందిస్తూనే సబ్జెక్ట్ థీమ్తో పార్కులను పరిచయం చేస్తున్నది. ఇటీవల ఐటీ కారిడార్లో టెకీల కోసమే ప్రత్యేకంగా థీమ్ పార్కును తీర్చిదిద్దిన అధికారులు తాజాగా కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ ఫేజ్-4 లోథా రోడ్లో జిమ్ బేస్డ్ థీమ్ పార్కును అభివృద్ధి చేసింది. ఆహ్లాదకర వాతావరణంగా ఆరోగ్యకర జీవనమే లక్ష్యంగా దాదాపు రూ.2కోట్లతో ఈ పార్కును తీర్చిదిద్దింది. చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా క్రీడా ప్రాంగణం, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా వ్యాయామం చేసుకునేందుకు వీలుగా సౌకర్యం, వాకింగ్ జోన్, రన్నింగ్ ట్రాక్, మల్టీపర్పస్ స్పోర్ట్స్ గ్రౌండ్, వాలీబాల్, బాడ్మింటన్, బాక్స్ క్రికెట్లతో పాటు యోగా సెంటర్ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా జిమ్ బేస్డ్ పార్కు అభివృద్ధి పనులను పూర్తి చేశామని, త్వరలో ఈ పార్కును అందుబాటులోకి తేస్తామని కూకట్పల్లి జోనల్
కమిషనర్ వి.మమత తెలిపారు.
గ్రేటర్లో 50 థీమ్ పార్కులు
గ్రేటర్ హైదరాబాద్లో రూ.130కోట్లతో 50 థీమ్ పార్కులను అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించి ఈ మేరకు విడతల వారీగా థీమ్ పార్కులను అందుబాటులోకి తీసుకువస్తున్నది. గత నాలుగేళ్లుగా ఈ పనులు చేపట్టగా.. ఇప్పటి వరకు 30 పార్కులను అభివృద్ధి చేసింది. 20 చోట్ల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. స్థానికుల అవసరాల మేరకు అర్బన్ బయో డైవర్సిటీ విభాగం అధికారులు వేర్వేరు థీమ్లతో పార్కులను ప్రజలకు పరిచయం చేస్తున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా థీమ్లు
యానిమల్ కింగ్ డమ్, కలర్స్, జపనీస్, జెన్ గార్డెన్, చిల్డ్రన్స్, ఉమెన్స్, సీతాకోక చిలుక, ఆక్సిజన్, షెడ్, మల్టీ జనరేషన్, కల్చర్, జిమ్, ఇంటరాక్టివ్, ప్లే, ఇంటిగ్రిటీ, ఎన్వీరాల్మెంటల్, బతుకమ్మ, జంగిల్, ఎల్ఈడీ పార్కులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.