ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 11 : ప్రతి ఒక్కరికి ఉన్నత విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని ఘట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని అంకుషాపూర్లో ఉన్న తెలంగాణ సాంఘీక, సంక్షేమ గురుకుల డిగ్రీ మహిళా కళాశాల(ఇబ్రహీంపట్నం)లో ఆదివారం జరిగిన స్వచ్ఛ గురుకుల్ ముగింపు కార్యక్రమంలో కౌన్సిలర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ… బడుగు, బలహీన, పేద విద్యార్థులకు అత్యున్నతమైన విద్యా బోధన అందించేందుకు గురుకులాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. అనంతరం కళాశాలలో పరిసరాలు, భోజన సదుపాయాలను పరిశీలించి అభినందించారు. స్వచ్ఛ గురుకుల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు కౌన్సిలర్ రమాదేవి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ హేమమాలిని, వైస్ ప్రిన్సిపాల్ మంజుల, టీఆర్ఎస్ నాయకులు యాదగిరి, శశికళ, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం ..
మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 11 : స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టాపూర్లో ఉన్న సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ‘స్వచ్ఛ గురుకులం’ పేరుతో నిర్వహిస్తున్న పారిశుధ్య వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు అవధానం శైలజ, బోధన, బోధనేత సిబ్బంది పాల్గొన్నారు.