అది 2001 జనవరి 26. గుజరాత్లోని కచ్ జిల్లా. ఉదయం ఒక్కసారిగా భారీ భూకంపం. భూప్రకంపనల తీవ్రతకు 3.4 లక్షల ఇండ్లు, భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. దాదాపు 20 వేల మంది మరణించగా, 1.67 లక్షల మందికి గాయాలయ్యాయి. ఆశ్రయం కోల్పోయిన వారికి ఇండ్లు, ఆర్థిక సాయం అందిస్తామని అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీ ప్రకటించారు. 22 ఏండ్లు గడిచాయి. ఇప్పటికీ, వారికి ఇండ్లు కట్టివ్వలేదు. ఆర్థిక సాయం అందించలేదని ‘ది క్వింట్’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): కచ్ భూకంపంలో ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇండ్లు కట్టించడంతో పాటు ఒక్కో కుటుంబానికి రూ.90 వేల ఆర్థిక సాయం చేస్తామని అప్పటి గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, తమకు ఇప్పటివరకు ఏ సాయమూ అందలేదని కచ్ జిల్లాలోని అదోయి గ్రామస్థులు మండిపడుతున్నారు. మహారాష్ట్రలోని అప్పటి కాంగ్రెస్ సర్కారు ఇండ్లు కట్టించడానికి ముందుకు వచ్చినప్పటికీ, ఇంటి నిర్మాణ స్థలాల కేటాయింపులు, ప్రతిపాదనలు సిద్ధం చేయడంలో గుజరాత్ ప్రభుత్వం తాత్సారం చేసింది.
మహారాష్ట్ర ప్రభుత్వం కట్టించిన కొన్ని ఇండ్లకు గుజరాత్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో లబ్ధిదారులకు ఆ ఇండ్లు దక్కలేదు. దీంతో అదోయి గ్రామంతో పాటు కచ్ జిల్లాలోని ఏడెనిమిది గ్రామాల ప్రజలు బీజేపీ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కచ్ భూకంపం ఘటన జరిగి 22 ఏండ్లు గడిచిన నేపథ్యంలో గత ఆగస్టులో భుజ్ జిల్లాలో ప్రధాని మోదీ ‘స్మృతి వనం’ పేరిట ఓ స్మారకాన్ని ఆవిష్కరించారు. అయితే, ‘గూడు లేకుండా అవస్థలు పడుతుంటే, ఆ స్మృతి వనాలు ఎందుకోసం?’ అని ప్రధాని మోదీని భూకంప బాధితులు నిలదీస్తున్నారు. ఇండ్లు, పరిహారం రెండూ ఇస్తామంటూ సర్కారు మాట తప్పిందని ధ్వజమెత్తారు. ఇల్లు లేదా పరిహారం రెండిట్లో ఏదో ఒకటి కోరుకోవాలంటూ తర్వాత కొత్త మెలిక పెట్టిందని, ఆ తర్వాత ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్మారకాలతో కష్టాలు పోతాయా?
స్మారకాలతో కష్టాలు పోతాయా అని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదోయి గ్రామానికి చెందిన కన్యాభాయ్ పటేల్ మాట్లాడుతూ.. ‘గుజరాత్ ప్రభుత్వం మాకు ఏ సాయం చేయలేదు. పరిహారం పేరిట వాళ్లు ఇస్తానన్న మొత్తం అతి తక్కువ. అందుకే దాన్ని వద్దనుకొన్నాం. భూకంప బాధితుల కోసం ప్రధాని ఏదో స్మారకాన్ని ఆవిష్కరించారని విన్నా. దాన్ని చూడాలని అనుకోవట్లే. అసలు ఆ స్మృతివనం ఎవరి కోసం ఆవిష్కరించారు? ఆ స్మారకాలు మా కష్టాలను దూరం చేస్తాయా?’ అని నిలదీశారు.
పరిహారం కూడా దక్కలే
మహారాష్ట్రలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూకంపం బాధితుల కోసం 1,500-2,000 ఇండ్లు నిర్మించి ఇచ్చింది. అయితే వాటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా గుజరాత్ సర్కారు పూర్తిచేయలేదు. దీంతో బాధితులకు ఆ ఇండ్లు దక్కలేదు. ఇస్తామన్న రూ.90 వేల పరిహారం కూడా ఇవ్వలేదు. చాలా తక్కువ మందికే పరిహారం లభించింది. అది కూడా రూ.30 వేలు దాటలేదు.
-వన్కార్భాయ్, అదోయి మాజీ సర్పంచ్