Hyderabad | కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు విద్యానగర్లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2023-24 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ సుకన్య పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులను ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ కళాశాల ఆఫీసులో దరఖాస్తు చేసుకోవలసిందిగా సూచించారు. అర్హులైన అభ్యర్థులకు 17వ తేదీన ఉదయం 11 గంటలకు కాలేజీ ప్రాంగణంలోనే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పొలిటికల్ సైన్స్-1, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్-1 మొత్తం కలిపి రెండు పోస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు.
అభ్యర్థులకు పీజీలో మినిమం 55 శాతం మార్కులు (50 శాతం ఎస్సీ/ఎస్టీలకు) వచ్చి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డీ కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పీహెచ్డీ అభ్యర్థులు లేని పక్షంలో నెట్/సెట్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వీరు కూడా లేని పక్షంలో పీజీ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. బోధనానుభవం కలిగిన వారికి వెయిటేజి ఇస్తారు. వీరు తమ సర్వీస్ సర్టిఫికెట్ సమర్పించాలి. అయితే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.