వ్యవసాయ యూనివర్సిటీ , నవంబర్ 16: కరోనా అనంతరం ప్రజల జీవన విధానంలో ఎంతో మార్పు వచ్చింది. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చూడటానికి చిన్నగా ఉండే చిరుధాన్యాల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని అనేక పరిశోధనలు తేల్చడంతో వీటి వినియోగం మరింతగా పెరిగింది. దీంతో ప్రజలకు స్వచ్ఛమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 2013 సంవత్సరంలో వర్సిటీ పరిధిలోని రాజేంద్ర నగర్ లో మిల్లెట్ ప్రొసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించారు. దీంతో హైదరాబాద్ వాసులే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా ఇక్కడకు వచ్చి మిల్లెట్ ఫుడ్ను కొనుగోలు చేస్తున్నారు.
అందుబాటులో పౌష్టిక ఆహారం ..
మిల్లెట్స్ ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా జొన్న, రాగి,సజ్జ, కొర్ర,సామ, అరికలు, వరిగలు, ఊదలు, అండుకొర్రలు తదితర ధాన్యాల నుంచి పిండి, రవ్వ, బిస్కెట్స్, నూడిల్స్, సేమియా, కేక్స్, కప్కేక్స్, బ్రెడ్స్, మురుకులు, ఇడ్లీ, దోశ, వంటివి తయారు చేస్తున్నారు. యూనివర్సిటీ పరిధిలో లభించే వాటితో పాటు, మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్ఎస్జీ ), రైతుల నుంచి డిమాండ్ను బట్టీ ముడి ధాన్యాన్ని తీసుకొని నాణ్యమైన ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.
డిమాండ్కు తగ్గట్టుగా…
మిల్లెట్స్ ఫుడ్స్ వైపు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. డిమాండ్కు తగ్గట్టుగా తయారు చేస్తున్నాం. నగరం నుంచి ఉద్యోగస్తులు, నేతలు, పట్టణ వాసులు, రైతులు,ఈ ఉత్పత్తులను తీసుకెళ్తున్నారు.కొన్ని సార్లు ఇతర రాష్ర్టాల వారు కూడా ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటున్నారు. వెంటనే తయారు చేసి వారికి అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
– డా. అనిలా కుమారి, సెంటర్ ఇంచార్జి, అసిస్టెంట్ ప్రొఫొసర్ రాజేంద్ర నగర్