కొండాపూర్ : కొండాపూర్లోని 8వ పోలీసు బెటాలియన్లో బుధవారం కమాండెంట్ పీ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ పర్యావరణ సంరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడడం అలవాటు చేసుకోవాలన్నారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
సంపూర్ణ ఆరోగ్యంతోనే ఏదైనా సాధించవచ్చని, పర్యావరణాన్ని మనం రక్షించినప్పుడే మనం ఆరోగ్యవంతమైన వాతావరణంలో జీవించగలుగుతామన్నారు. అనంతరం బెటాలియన్ అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ టీ గంగారం, అసిస్టెంట్ కమాండెంట్లు ఎం రహమాన్, డీ నారాయణ దాస్, ఏఓఈ కళ్యాణి, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.