సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): వానలతో మొన్నటి వరకు చల్లబడిన గ్రేటర్ వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. రెండు మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో పగటి పూట జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తుండటంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 40.2, కనిష్ఠం 27.3 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 32 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా జూన్ 1, 2 తేదీల్లో గ్రేటర్కు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.