సమైక్య పాలనలో నాడు కరెంట్ ఉంటే వార్త. వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పుచ్చునేమో కానీ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి. పొట్టకొచ్చిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే తట్టుకోలేని రైతులు చెట్లకు ఉరేసుకొని ప్రాణాలు విడిచిన ఉదంతాలు అనేకం. సరిపడా బొగ్గు నిల్వలు.. పుష్కలమైన గోదావరి జలాలు ఉన్నా కరెంట్ కొరతతో తెలంగాణ చిమ్మ చీకట్లో మగ్గిపోయింది.
కట్ చేస్తే..నేడు పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్యుత్ వెలుగులు ప్రగతికి చిహ్నాలుగా మారాయి. రెప్పపాటులో కూడా కరెంట్ పోని అపురూప సన్నివేశం. ఇప్పుడు ఇక్కడ కరెంట్ పోతేనే వార్త అనే స్థితికి మనం చేరుకున్నాం. రాష్ట్రం వస్తే అంధకారమన్న వాళ్ల కండ్లు తెరిపిస్తూ నేడు తెలంగాణ మిగులు విద్యుత్తో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆధునిక టెక్నాలజీతో అంతరాయం లేకుండా ప్రజలకు నిరంతర కరెంట్ను అందిస్తున్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ దార్శినికతతోనే సాధ్యమైంది. వెలుగు జిలుగుల తెలంగాణ ప్రస్థానంపై దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం..
సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరాను దిగ్విజయంగా అందిస్తున్నది. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ సరఫరాలో ఏమాత్రం అంతరాయం కలగకుండా అధికారులు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారు. ఎంత డిమాండు ఉన్నా సరఫరా చేసే సామర్థ్యం మన డిస్కమ్కు ఉందని అధికారులు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ పంపిణీ విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకున్నది. ఇందుకు కోసం పెద్ద మొత్తంలో సబ్స్టేషన్లను, ఫీడర్లను, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యలు లేకుండా మెరుగైన సేవలు అందిస్తున్నారు.
మహానగరం నలుమూలలా విస్తరిస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధితో పాటు ఔటర్ రింగురోడ్డు దాటి శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో విద్యుత్ డిమాండు పెరుగుదల శాతం ప్రతియేటా 8 శాతం ఉండగా, కోర్ సిటీతో పోల్చితే శివార్ల ప్రాంతాల్లో 15- 20 శాతం డిమాండ్ పెరుగుతున్నదని అధికారులు తెలిపారు. ఇదంతా నగర విస్తరణ వల్లే విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నది చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ విద్యుత్ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గ్రేటర్ పరిధిలో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలంటే ఎలాంటి ఏర్పాట్లు కావాలని నిపుణులను అడిగి, దానికి అనుగుణంగా నిధులను సమకూర్చడం వల్లే విద్యుత్ అంతరాయం అనే మాట వినిపించకుండాపోయింది. విద్యుత్ సరఫరా విషయంలో సీఎం కేసీఆర్ కోరుకున్నట్లుగా విద్యుత్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి లోపాలు తలెత్తకుండా క్షేత్ర స్థాయిలో యంత్రాంగం పనిచేస్తున్నది.
హైదరాబాద్లో ఉన్న ఐటీ కంపెనీల్లో 80 శాతం కంపెనీలు వెస్ట్జోన్ పరిధిలోనే ఉన్నాయి. దీంతో వెస్ట్జోన్ పరిధిలో ఉన్న ఐటీ కారిడార్లో మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. ఇందులో భాగంగానే మాదాపూర్లోని 132/33 కేవీ సబ్ స్టేషన్లో రూ.8 కోట్ల వ్యయంతో 33 కేవీ స్విచ్ఛింగ్ స్టేషన్ను ప్రారంభించారు. దీంతో ఐటీ కారిడార్లో కొత్తగా ఎన్ని కంపెనీలు వచ్చినా నిరంతర రాయంగా విద్యుత్ను సరఫరా చేసేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.
గ్రేటర్ పరిధిలో విద్యుత్ సరఫరా కోసం 9 సర్కిళ్లను ఏర్పాటు చేసింది. ఇందులో సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోనే ప్రతియేటా ఎక్కువగా విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతున్నది. అదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ ఐటీ కంపెనీలు సైతం ఇక్కడే తమ కంపెనీల కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో డిమాండు అంతా సైబర్ సిటీ సర్కిల్లోనే ఎక్కువగా ఉండడంతో దానికి అనుగుణంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మెరుగైన, నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థ కోసం పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నది.
నిరంతర విద్యుత్ సరఫరానే కాదు విద్యుత్ వినియోగదారులకు ఆన్లైన్లోనే మెరుగైన సేవలను అందిస్తున్నారు. విద్యుత్ కార్యాలయాలకు రాకుండానే అరచేతిలోని స్మార్ట్ఫోన్లోనే కొత్త కనెక్షన్లకు దరఖాస్తులు చేసుకోవడం, అవసరమైన ఫీజులు చెల్లింపులు సులువుగా చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 9 సర్కిల్ కార్యాలయాలు ఉండగా, వాటి పరిధిలోని సెక్షన్ కార్యాలయాల్లో కస్టమర్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)లను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ బిల్లుల చెల్లింపులు 60 శాతానికి కంటే ఎక్కువ మంది ఆన్లైన్లోనే చెల్లిస్తున్నారు. ఎలాంటి సేవలనైనా ఆన్లైన్లోనే పొందేలా కస్టమర్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)ను ఆన్లైన్లోనే సమర్థవంతంగా నిర్వహిస్తున్నది. కనెక్షన్లను ఇచ్చేందుకు ఆన్లైన్ విధానాన్నే వినియోగించేలా ప్రత్యేకంగా వెబ్సైట్ను నిర్వహిస్తున్నారు. ts sadaran power.cgg.gov.in పేరుతో ఉన్న సంస్థ వెబ్సైట్లో ఆన్లైన్ సేవల కోసం ప్రత్యేకంగా లింక్ను ఏర్పాటు చేశారు.
కరెంటు సరఫరాలో అంతరాయంపై ఫిర్యాదుల కోసం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చక్కని పరిష్కార మార్గాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫిర్యాదుల కోసం ఉన్న 1912 నంబర్కు ఫోన్ చేస్తే ఒకసారి కేవలం 20 లైన్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఒకేసారి 300 కాల్స్ వచ్చినా తీసుకునే ఏర్పాట్లు చేయడంతో పాటు ఐవీఆర్ఎస్( ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ద్వారా ప్రతికాల్ను నమోదు చేసేలా వ్యవస్థను రూపొందించారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సొలార్ విద్యుత్ ఉత్పత్తి క్రమంగా పెరుగుతున్నది. కాలుష్యం లేకుండా, సహజ వనరులను ధ్వంసం చేయకుండా, పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తికి సూర్యరశ్మి (సోలార్) కేంద్ర బిందువుగా మారింది.
మేడ్చల్, జూన్ 6 : కరెంట్ కోతల కాలానికి కాలం చెల్లింది. మేడ్చల్లో కరెంట్ వ్యవస్థ మెరుగుపడటంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. తెలంగాణ వచ్చిన కొత్తలో మేడ్చల్ నియోజకవర్గంలో విద్యుత్ వ్యవస్థ ఘోరంగా ఉండేది. కరెంట్ కోతలు, లో వోల్టేజీ సమస్యలు అధికంగా ఉండేవి. లోడ్ ఎక్కువై తరుచుగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండేవి. వారానికి రెండు, మూడు రోజులు పవర్ హాలీడేలు ఉండేవి. దీంతో వ్యవసాయం, పరిశ్రమలు దివాళా తీసే దుస్థితి నెలకొని ఉండేది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రూ.310.07 కోట్లతో విద్యుత్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించారు. సరఫరా, పంపిణీ సబ్స్టేషన్లు, పవర్, సరఫరా ట్రాన్స్ఫార్మర్ల సంఖ్యను పెంచారు. దీంతో నియోజకవర్గంలోని జీనోమ్ వ్యాలీకి ప్రపంచ ప్రఖ్యాతిసంస్థలు తరలివచ్చాయి. జీనోమ్ వ్యాలీలో అంతర్జాతీయ సంస్థలు ఆర్ అండ్ డీలను నెలకొల్పడటంలో విద్యుత్ శాఖ కృషి ఉందంటే ఇదంతా మెరుగైనా విద్యుత్ వ్యవస్థ ఉండటమేనని అధికారులు చెబుతున్నారు.
గత 9 ఏండ్లలో సంస్థ పరిధిలో పంపిణీ వ్యవస్థ మెరుగుపర్చడం కోసం 14,063 కోట్ల రూపాయలు వెచ్చించాం. ఇందులో రూ.10 వేల కోట్లను గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్ల పరిధిలోనే ఖర్చు చేశాం. 9 ఏండ్లలో కొత్తగా 578, 33 /11 సబ్ స్టేషన్లు, 5,777 కిలో మీటర్ల 33 కేవీ నెట్ వర్, 42,474 కిలో మీటర్ల 11 కేవీ నెట్ వర్, 1365 పీటీఆర్లు, డీటీఆర్లు 2,69,158లను ఏర్పాటు చేశాం. 2014 లో 68.84 లక్షలుగా నున్న కనెక్షన్ల సంఖ్య నూతనంగా 40.45 లక్షల కనెక్షన్ల మంజూరుతో 1.09 కోట్లకు చేరింది. గత తొమ్మిదేండ్లలో ఎల్టీ, హెచ్టీ కేటగిరీల్లో అదనంగా 58% నూతన కనెక్షన్లు మంజూరు చేశాం. రాష్ట్రం ఏర్పడేనాటికి కేవలం డిస్కం పరిధిలో 5,661 మెగావాట్లుగా ఉన్న గరిష్ఠి విద్యుత్ డిమాండ్ ప్రస్తుతానికి 15,497 మెగావాట్ల కు చేరింది. సంస్థ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ, టీఎస్ఎస్పీడీసీల్కు 2021 & 2022 సంవత్సరాల్లో A రేటింగ్ ఇచ్చింది. భవిష్యత్తులో సైతం ఇదే ఒరవడిని కొనసాగిస్తూ సంస్థకు మంచి పేరు తీసుకుకొస్తాం.
– సీఎండీ జి.రఘుమారెడ్డి