సిటీబ్యూరో, సెప్టెంబరు 28 (నమస్తే తెలంగాణ): వెళ్లిరావయ్యా.. గణపయ్య..! అంటూ గ్రేటర్ వాసులు బొజ్జగణపయ్యను శోభాయమానంగా సాగనంపారు. లంబోదరా నమోః నమోః అంటూ దూప, దీప, నైవేథ్యాలతో భక్తుల సేవలందుకున్న లంబోదరుడు గురువారం నిమజ్జనంతో గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. కన్నుల పండువగా శోభాయాత్ర నగర వీధుల్లో సందడిగా సాగింది. లక్షలాది భక్తుల భక్తిపూర్వకమైన భజనలు, నృత్యాలతో గణనాథుడికి ఘనమైన వీడ్కోలు పలికాయి. పగలంతా ఎండ, సాయంత్రం వాన విఘ్నంగా వచ్చినా.. భక్తుల మొక్కవోని దీక్షతో శోభాయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు.
బాలాపూర్ గణపతికి తెల్లవారుజామున గణేశ్ ఉత్సవ సమితి ప్రత్యేక పూజలు జరిపి సామూహిక వినాయక నిమజ్జన యాత్రను ప్రారంభించారు. ఉదయం ఐదు గంటలకు మండపం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. సుమారు ఐదు గంటల పాటు బాలాపూర్ పురవీధుల్లోనే తిరిగి 10:25 గంటలకు బోడ్రాయి వద్దకు చేరింది. దాదాపు 15 నిమిషాల పాటు లడ్డూ వేలం నిర్వహించారు. తిరిగి ఉదయం 10:40 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర ట్యాంక్బండ్కు చేరుకొని సాయంత్రం 4:30 గంటలకు నిమజ్జనం అయ్యింది. మిగతా ఉత్సవ విగ్రహాలు కూడా బాలాపూర్ వినాయకుడి శోభాయాత్రను అనుసరిస్తూ నిమజ్జన యాత్రకు బయలుదేరాయి.
వినాయక విగ్రహ ప్రతిష్టాపన తొలి పూజ నుంచి తుది పూజ వరకు పెద్దలే అన్నీ తామై చేసినా నిమజ్జన శోభాయాత్రలో మాత్రం యువతే అన్నీ తామై పార్వతీ తనయుడికి సేవలందించారు. ప్రసాదాల పంపిణీ, విగ్రహ తరలింపుతోపాటు యాత్ర మొదలయ్యింది మొదలు నిమజ్జన తిరుగు ప్రయాణంలోనూ డీజే పాటల జోష్లో యువత చిందేసింది. వినాయక పాటలకంటే హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే బోనాల జాతర, గండిపేట మైసమ్మ, మహంకాళి పాటలు హోరెత్తిస్తూ యువకులు జోరుగా నృత్యాలు చేశారు.
వినాయక శోభాయాత్ర సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించి శోభాయాత్రను పరిశీలించారు. ముందుగా ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం చార్మినార్, మోజంజాహి మారెట్, అబిడ్స్, లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ల వద్ద శోభాయాత్రగా వస్తున్న విగ్రహాలకు స్వాగతం పలికారు. హుస్సేన్ సాగర్లో బోట్లో తిరుగుతూ నిమజనాన్ని పర్యవేక్షించారు. అదేవిధంగా మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్లో హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్తో కలిసి ఏరియల్ వ్యూ ద్వారా నగరంలో గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్న తీరును పరిశీలించారు.
తెలంగాణ ప్రభుత్వం పండుగలు, ఉత్సవాల విశిష్టతను మరింత పెంపొందించే విధంగా ఏర్పాట్లను చేస్తూ ఘనంగా నిర్వహిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో నిర్వహించే గణేశ్ ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఈ సంవత్సరం నగరంలో సుమారు 90 వేల విగ్రహాలను ఏర్పాటు చేశారని.. శుక్రవారం ఉదయం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశాలున్నాయని పేరొన్నారు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా వీక్షించే 63 అడుగుల ఎత్తు గల ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం మధ్యాహ్నం వరకే పూర్తయ్యిందని, భక్తుల అభీష్టం మేరకు ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసిందని వివరించారు. పోలీసు, టూరిజం, వాటర్ వర్స్, ఎలక్ట్రికల్, హెల్త్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిసున్నారని అన్నారు. నగరానికి చెందిన పోలీసు అధికారులు, సిబ్బందే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా తీసుకొచ్చి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
ఉదయం నుంచే నగరంలోని అనేక మండపాల వద్ద పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగిస్తూ హుస్సేన్ సాగర్, సరూర్నగర్, సఫిల్గూడ, కూకట్పల్లి తదితర చెరువుల్లో నిమజ్జనం చేసేందుకు ఒక్కసారిగా వేల సంఖ్యలో ఉత్సవ విగ్రహాలు బయలు దేరడంతో నగర వీధులన్నీ భక్తులతో పోటెత్తాయి. కిలోమీటర్ల పొడవునా నగర ప్రధాన రహదారులపై ఉత్సవ విగ్రహాలు బారులు తీరాయి.
జీహెచ్ఎంసీ, ఇతర శాఖల సమన్వయంతో గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. అనుకున్న సమయంలో గణేశ్ నిమజ్జనం పూర్తి చేశామని, మధ్యాహ్నం 1:30 గంటలోపు ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తి చేశామన్నారు. గణేశ్ నిమజ్జనానికి సహకరించిన హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, నగర సీపీ ఆనంద్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి, విద్యుత్, జలమండలి, టూరిజం శాఖ అధికారులు, ఖైరతాబాద్ గణేశ్కమిటీ ఉత్సవ సభ్యులకు నగర ప్రజల తరఫున మేయర్ ధన్యవాదాలు తెలిపారు. పూజా సామాగ్రి, చెత్త వేరు పర్చాలని శానిటేషన్ సిబ్బందిని మేయర్ కోరారు. గణేశ్ నిమజ్జనానికి 3వేల శానిటేషన్ సిబ్బది, 369 క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. శోభయాత్రకు 30 కోట్లతో సివిల్ వర్క్స్, ట్రాన్స్పోర్టు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శోభాయాత్ర నిర్వహించే మార్గాలలో 48,179 లైటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు.