సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో రాత్రి అయ్యిందంటే చాలు.. దోమలు విరుచుకుపడుతున్నాయి. ఈ కారణంగా గ్రేటర్లో మరోసారి డెంగీ, మలేరియా, చికున్ గున్యా కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు వైద్యశాలల్లో జ్వరాలతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇదిలా ఉంటే నగరంలోని పలు బస్తీ దవాఖానలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ పరీక్షలు నిర్వహించే కిట్స్ లేవని సిబ్బంది చెబుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఇది డెంగీ సీజన్ కాదులేండి అంటూ..నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, దీనివల్ల ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లకతప్పడం లేదంటున్నారు.
మరోవైపు బస్తీల్లో పేరుకుపోతున్న వ్యర్థాలు, మురుగునీరు వంటి వాటితో దోమలు వృద్ధి చెంది.. కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కొంత కాలంగా జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం అధికారులు పరిశుభ్రతను గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎంటమాలజీ, మలేరియా విభాగం అధికారులు, సిబ్బంది దోమల నివారణలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే దోమల నివారణ కోసం ఫాగింగ్, యాంటి లార్వా వంటి చర్యలు చేపట్టడం లేదని, అనేక సార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.