సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ బీఆర్ఎస్ శ్రేణులు పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు నల్లగొండ సభకు తరలివెళ్లారు. ఆర్టీసీ బస్సులతో పాటు భారీ సంఖ్యలో కార్ల ర్యాలీలతో నియోజకవర్గాల వారీగా వేల సంఖ్యలో సభకు తరలివెళ్లారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సభకు వెళ్లారు.
కృష్ణా ప్రాజెక్టులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునివ్వగా.. ఈ సభకు అన్నివర్గాల ప్రజానీకం తండోపతండాలుగా తరలివెళ్లారు. కృష్ణా జలాల కోసం కొట్లాడకుండా..కేఆర్ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరీని ఎండగట్టిన తీరు.. కట్ట కాలేంత వరకు తెలంగాణ హక్కుల కోసం పులిలా కొట్లాడతానని కేసీఆర్ సభ ద్వారా ప్రసంగించిన తీరును అందరినీ ఆకట్టుకున్నది. ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ నిర్వహించిన తొలి సభ బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ కొత్త జోష్ను నింపింది.