సీసీరోడ్లు, స్నానాల గదులు ఏర్పాటు
సేద తీరేందుకు విశ్రాంతి గదులు
హరితవనంలా శ్మశాన వాటికలు
ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 4: మనిషి బతికున్నప్పుడు ఎలా జీవించినా, చనిపోయినప్పుడు ప్రశాంతంగా ఆఖరి మజిలీ సాగాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో శ్మశాన వాటికల పరిస్థితి దారుణంగా ఉండేది. మనిషి చనిపోయాక చితిపెట్టేందుకు కనీసం కాటిగద్దెలు కూడా కనికరించేవి కావు. మరోవైపు ఎలాంటి సౌకర్యాలు సైతం ఉండేవి కాదు. స్నానాలు చేయలన్నా, బట్టలు మార్చుకోవాలన్నా అసౌకర్యంగా ఉండేది. ఎండా వానల నుంచి రక్షణ కల్పించేందుకు ఎలాంటి ఏర్పాట్లు ఉండేవి కావు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీఠ వేసింది. దీంతో తార్నాక డివిజన్లోని శ్మశాన వాటికల దశ తిరిగింది. తార్నాకలోని ఆర్యన్ శ్మశాన్ ఘాట్, లాలాపేట ఫ్లై ఓవర్ కింద ఉన్న ముస్లింల శ్మశాన వాటిక, లాలాపేట సాయినగర్ శ్మశాన వాటిక, తార్నాకలోని హనుమాన్నగర్లోని శ్మశానవాటికల్లో దాదాపు రూ.కోటి వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో విశ్రాంతి గదులు, స్నానపు గదులు, ప్రహరీగోడ, సీసీ రోడ్లు, మంచినీటి పైపులైన్లు నూతనంగా నిర్మించారు. దీంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంత్యక్రియలకు హాజరవుతున్నారు.
శ్మశాన వాటికల్లో సమస్యలు లేకుండా చేస్తా
గతంలో సరైన వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. ఇప్పటికే డివిజన్లోని నాలుగు శ్మశాన వాటికలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాం. మిగిలిన శ్మశాన వాటికల్లో కూడా త్వరలో మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణ వచ్చాక శ్మశాన వాటికల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుంది. – మేయర్, మోతె శ్రీలతా శోభన్రెడ్డి