వ్యవసాయ యూనివర్సిటీ, ఫిబ్రవరి 16: మన ప్రాంతంలో ద్రాక్ష ఎంత సాగు చేస్తే అంత మంచి ఫలితాలుంటాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాగుకు చాలా అనుకూల వాతావరణం ఉందని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి, డా. నీరజాప్రభాకర్ అన్నారు. గురువారం ఆమె రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఏఐసీఆర్పీ ద్రాక్ష పరిశోధన కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 20 ఏండ్లతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు వ్యవసాయ, అనుబంధ రంగాలు ప్రధానంగా పండ్లు, కూరగాయల సాగుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ మహానగరానికి సమీపంలోని గ్రామాల్లో ఇప్పటికే కూరగాయలు, పండ్ల సాగు పెరిగిందని చెప్పారు. గతంలో దేశంలోని ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకునేవారమన్నారు. ప్రస్తుతం మనకు సరిపడా తాజా కూరగాయలు, పండ్లు ఇక్కడే లభిస్తున్నాయని అన్నారు. ద్రాక్ష రసంలో పుష్కలంగా లభించే పోషకాలు, చక్కెరలు , సహజ ఆమ్లాలు తక్షణ శక్తిని అందిస్తాయని పేర్కొన్నారు. అనేక రకాల క్యాన్సర్, గుండె జబ్బులను నివారించడంలో తోడ్పడుతాయన్నారు.