సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల జారీకి అడ్డుకట్ట పడడం లేదు. నాన్ అవైలెబులిటీ సర్టిఫికెట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను అధికారులు జారీ చేస్తున్నారు. గతంలోనే 31,454 ధ్రువపత్రాలను గుర్తించిన అధికారులు మీ సేవా సెంటర్ నిర్వాహకులపై మాత్రమే చర్యలు తీసుకోగా.. అసలు బాధ్యులైన అధికారులపై పెద్దగా చర్యలు తీసుకోలేదు. దీంతో రెచ్చిపోతున్న సంబంధిత విభాగం అధికారులు నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల జారీలో అవినీతి దందాకు తెరలేపారు. తాజాగా ఫలక్నుమా సర్కిల్ కార్యాలయం నుంచి నాన్ అవైలెబులిటీ సర్టిఫికెట్ లేకుండా దాదాపు 80 సర్టిఫికెట్లు జారీ చేశారని తెలుస్తున్నది. 1998లో జన్మించిన వ్యక్తికి గతేడాది నవంబర్లో నాన్ అవైలెబులిటీ కింద సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలిసింది. ఇదే రకంగా ఖైరతాబాద్, సికింద్రాబాద్, సంతోష్నగర్, చార్మినార్, గోషామహల్ సర్కిల్లలో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల జారీ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతున్నది. ఇటీవల నకిలీ ఫింగర్ ప్రింట్స్తో రూ.84 లక్షలను సంస్థ ఖజానాకు కన్నం పెట్టిన ఘటన మరువకముందే నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల జారీ అక్రమాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
జీహెచ్ఎంసీ పరిధిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అవినీతిని చెక్ పెట్టాలన్న ఉద్ధేశంతో 2022 ప్రారంభంలో ‘ఇన్స్టంట్ ఆఫ్రూవల్’ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చి అమలు చేస్తున్నారు. దవాఖానల్లో జరిగే జనన, మరణాల ధ్రువపత్రాల ఆధారంగా జీహెచ్ఎంసీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుంది. వివరాలను నమోదు చేసి, సరైన పత్రాలను అప్లోడ్ చేస్తే సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి వెంటనే ఆన్లైన్లోనే సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. ఐతే మరో విధానంలో భాగంగా దవాఖానల్లో కాకుండా ఇంటి వద్ద జరిగే జనన, మరణాల వివరాలు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండవు. అందుకే వీటిని నాన్ అవైలెబులిటీగా పేర్కొంటారు. అంటే ఆస్పత్రుల నుంచి జీహెచ్ఎంసీకి అందే వివరాల్లో లేని వాటిని నాన్ అవైలెబులిటీ కింద ఆర్డీవో ఇచ్చే పత్రాలను ఆధారంగా చేసుకుంటారు. రెవెన్యూ అధికారులు నాన్ అవైలెబులిటీ కింద ధ్రువీకరణ చేసేందుకుగాను ప్రత్యేక ప్రక్రియ ఉంటుంది. ఇందులో భాగంగా సదరు దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసుకున్న తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన చేసి వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయనుకుంటే బహిరంగ నోటీసు జారీ చేస్తారు. నిర్ణీత సమయంలోపు ఎలాంటి అభ్యంతరాలు రానట్లయితే నాన్ అవైలెబులిటీ పత్రాన్ని జారీ చేస్తారు. దాని ఆధారంగా మీ సేవలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే జీహెచ్ఎంసీ అధికారులు కొందరు ముందుగానే మిలాఖత్ అవ్వడంతో నాన్ అవైలెబులిటీ పత్రం కింద తెల్ల కాగితాలు ఉన్నప్పటికీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నారు. ఏఎంఓహెచ్ఓల పనితీరుపై నిఘా పెట్టాలన్న డిమాండ్ వ్యక్తమవుతుంది.