హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) :తెలంగాణ మార్గదర్శి.. విజన్ ఉన్న నాయకుడు.. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని నగరమంతా సంబురాలు మిన్నంటాయి. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులన్నీ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యాయి. దివ్యాంగులకు వాహనాలు, మహిళలకు కుట్టుమిషన్లతో పాటు రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహించారు. హరితహారం మొక్కలు నాటి.. ఆట పోటీలు, సైకిల్ ర్యాలీలు చేపట్టారు. సర్వ మత ప్రార్థనలు నిర్వహించి.. సామాజిక మాధ్యమాల్లోనూ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. మంత్రుల నుంచి మొదలుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, సాధారణ కార్యకర్తల వరకు ఎవరికి వారు.. తమ పరిధిలో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేదలు, అసహాయులకు సాయం చేసి, ప్రత్యేక బహుమతులు అందించి వారి ముఖాల్లో నవ్వులు పూయించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు సోమవారం గ్రేటర్వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఇందులో భాగస్వాములయ్యారు. ఒక్కొక్కరూ ఒక్కోరీతిలో యువనేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలు చోట్ల సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తన సొంత ఖర్చుతో ఎలక్ట్రిక్ బైకులను కొనుగోలు చేసి..నియోజకవర్గంలోని 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు బహుమతిగా అందజేశారు. రాయదుర్గం ఐటీ పార్కులో వెయ్యి మంది టెకీలు రక్తదానం చేశారు.నెక్లెస్రోడ్లోని థ్రిల్ సిటీలో సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా 1000 మంది వీడియో జర్నలిస్టులకు 10 లక్షల విలువైన ఆరోగ్యబీమా కార్డులను అందజేశారు. ప్రపంచ రికార్డు సాధించిన రూబిక్స్ క్యూబ్ ఆర్టిస్ట్ ఇర్ఫాన్ కుట్టి కండ్లకు గంతలు కట్టుకొని రూబిక్స్ క్యూబ్స్తో రూపొందించిన కేటీఆర్ చిత్రం, హ్యాపీ బర్త్ డే అన్న విషెష్ విశేషంగా ఆకట్టుకున్నది.
వెయ్యి మంది వీడియో జర్నలిస్టులకు ఆరోగ్య బీమా ;కేటీఆర్ పుట్టిన రోజున గిఫ్ట్ ఏ స్మైల్
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు పీవీ మార్గ్లోని థ్రిల్ సిటీ థీమ్ పార్కులో యువనేత, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ప్రపంచ రికార్డు సాధించిన రూబిక్స్ క్యూబ్ ఆర్టిస్ట్ ఇర్ఫాన్ కుట్టి కండ్లకు గంతలు కట్టుకొని రూబిక్స్ క్యూబ్స్తో రూపొందించిన కేటీఆర్ చిత్రం, హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అన్న విషెస్ ఎంతగానో ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా మంత్రులు మహమూద్ అలీ, తలసాని ఇర్ఫాన్ కుట్టిని సత్కరించి అభినందించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఒక్కొక్కరికీ 10 లక్షల రూపాయల రిస్క్ కవరేజ్తో వివిధ చానళ్లకు చెందిన 1000 మంది వీడియో జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. థ్రిల్ సిటీ థీమ్ పార్కులో వరల్డ్ బిగ్గెస్ట్ త్రీడీ స్క్రీన్లో మంత్రి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ రూపొందించిన వీడియోను వీక్షించారు. కేటీఆర్ పనితీరు, వ్యక్తిత్వం, సాధించిన విజయాలను వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక సాంగ్ను ప్రదర్శించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేశారు. కేటీఆర్ గొప్ప నేత అని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఎంతో మంది యువతకు కేటీఆర్ స్ఫూర్తి గా మారారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ప్రభాకర్రావు, మల్లేశం, స్టీఫెన్సన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నాగేశ్, కోలేటి దామోదర్ గుప్తా, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.
బహుమతి ఇచ్చి.. ఔదార్యం చాటి
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నియోజకవర్గానికి చెందిన 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎలక్ట్రిక్ స్కూటీలను బహుమతిగా అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. రహ్మత్నగర్ డివిజన్ ఎస్పీఆర్హిల్స్లో మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి ఎమ్మెల్యే మాగంటి కేక్ కట్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలకు తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ స్కూటీలను హోం మంత్రి మహమూద్అలీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలోనే నంబర్ వన్ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు మంత్రి కేటీఆర్ నిర్విరామంగా కృషి చేస్తున్నారన్నారు. ఎన్నో ఐటీ కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయని..ఎంతోమందికి ఉపాధి లభిస్తున్నదని చెప్పారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ బీఆర్ఎస్కు వెన్నెముకల కార్యకర్తలు పనిచేస్తున్నారని, ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలన్నారు. నిరుపేద కార్యకర్తలు 200 మందికి స్కూటీలను కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, దేదీప్యరావు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, వేణుగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కంటికి రెప్పలా కాపాడుకోవాలని..
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని మంత్రి కేటీఆర్ తరచూ చెబుతుంటారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోని 200 మంది పేద కార్యకర్తలను గుర్తించి, స్కూటీలను కొనాలని నిర్ణయం తీసుకున్నా. మంత్రి కేటీఆర్ సూచనలను పాటిస్తూ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు పెద్ద ప్రణాళికే పెట్టుకున్నా. ఆర్థిక భారమైనప్పటికీ కార్యకర్తలకు ఎలక్ట్రిక్ స్కూటీలను కొనుగోలు చేసి ఇచ్చా. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సత్కార్యానికి శ్రీకారం చుట్టి అందజేయడంలో ఎంతో సంతోషంగా ఉన్నది.
మాగంటి సాయం మరువలేనిది
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాకు బహుమతిగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ ఇచ్చారు. నాకే కాదు..మాలాంటి కార్యకర్తలు 200 మందికి బ్యాటరీతో నడిచే స్కూటీలను బహుమతిగా ఇవ్వడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. మాగంటి చేసిన సాయం మరువలేనిది.
స్కూటీపై ప్రయాణిస్తూ ..సంక్షేమ పథకాలు వివరిస్తా
కొత్త బ్యాటరీ స్కూటీపై ప్రయాణిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తా. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు నావంతు శాయశక్తులా కృషి చేస్తా. బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం అందించేందుకు అలుపెరుగని కృషి చేస్తా.
ఐటీ ఉద్యోగుల రక్తదానం
ఐటీ కారిడార్లోని రాయదుర్గం దివ్యశ్రీ ఎన్ఎస్ఎల్ ఐటీ పార్కులో మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐటీ పార్కులో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు.
హైదరాబాద్ మహానగరంలో ఐటీ రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతగా టెకీలు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారని, సుమారు 1000 మంది దాకా రక్తదానం చేసినట్లు టీఎఫ్ఎంసీ అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు.
మంత్రుల నివాస సముదాయంలో..
మంత్రుల నివాస సముదాయంలో మంత్రి జగదీశ్రెడ్డి తన నివాసంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి జడ్పీ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, గాదరి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, ఎన్. భాసర్రావు, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఫైళ్ల శేఖర్రెడ్డి, రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఒంటెద్దు నరసింహారెడ్డి, పార్టీ నేతలు నంద్యాల దయాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.