రంగారెడ్డి, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : బకాయి వేతనాలను చెల్లించాలంటూ సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట తెలంగాణ పంచాయతీ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లో 6,030 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి లైట్లు, కారోబార్, బిల్ కలెక్టర్లుగా పని చేస్తున్న వారికి నాలుగైదు నెలల వేతనాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నదన్నారు.
వేతనాలు రాక అప్పులు చేసి బతకాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా అనంతనం అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు గ్యార పాండు, ఎన్.రాజు, పి.సుధాకర్, అలువాల రవి కుమార్, ఎ.శేఖర్, గోపాల్, నర్సింహ, రాములు తదితరులు పాల్గొన్నారు.