భయాల్ని వీడండి.. సెల్ఫోన్కు దూరంగా ఉండండి
పత్రికలను చదివితేనే.. జనరల్ స్టడీస్లో మంచి మార్కులు
ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిందే.. నిపుణను వినియోగించుకోండి
సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ)/ కవాడిగూడ : అమ్మకు ఇచ్చిన మాటకోసం ఒకరు.. ఎలాగైన కొలువు కొట్టాలని లక్ష్యంగా మరొకరు.. ప్రజలకు సేవకుడిగా ఉండాలని ఇంకొకరు..ఇలా ఎందరో సర్కారీ కొలువు కోసం ఆరాటపడుతుంటారు. తమ కలలను నిజం చేసుకోవడానికి ఎదురుచూస్తుంటారు. లక్ష్యం అయితే పెట్టుకుంటారు. కానీ శిక్షణ ఎలా తీసుకోవాలి? పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలి? ఏ పుస్తకాలు చదవాలి?ఒత్తిడిని ఎలా అధిగమించాలి? కష్టాలను ఎలా దాటాలి? తదితర విషయాలపై అవగాహన లేక ఇబ్బందిపడుతుంటారు. సరైన మార్గం తెలియక సమయం వృథా చేసుకుంటుంటారు.
గైడెన్స్ ఇచ్చేవారు లేక తాము వెళ్లేది సరైన దారేనని అనుకుంటుంటారు. అట్లాంటి వారికి అండగా నిలిచింది నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే. ఉద్యోగార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో సోమవారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నగర నలుమూలల నుంచి ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొలువుకు సంబంధించిన ప్రతీ విషయం వివరిస్తూ.. నిపుణులు ఉద్యోగార్థులకు మార్గదర్శనం చేశారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండి సజ్జనార్, టీఎస్పీఎస్సీ మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, సీబీఎస్ ఐఏఎస్ అకాడమి డైరెక్టర్ బాలలత, సబ్జెక్టు నిపుణులు సీఎస్ వేప, తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాసరెడ్డి, నమస్తే తెలంగాణ వైస్ చైర్మన్ చిరంజీవి, సర్క్యులేషన్ జీఎం రామిరెడ్డి అతిథులుగా వక్తలుగా హజరయ్యారు.
అవగాహన సదస్సులో విద్యార్థులు అడిగిన సందేహాలకు టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, నిపుణులు వేప అంశాల వారీగా ఇలా సూచనలు చేశారు.
గ్రూప్-1కు ప్రిలిమ్స్కు ఎలా చదవాలి?
నోటిఫికేషన్లో సిలబస్ను పూర్తిగా తెలుసుకొంటే ఏవి చదవాలో?చదవొద్దో?తెలుస్తుంది. అధికారిక వెబ్సైట్లు, ప్రామాణిక మ్యాగజైన్లతో పాటు పలు ప్రామాణిక పేపర్లలో పూర్తిస్థాయిలో సబ్జెక్టును ప్రచురిస్తున్నారు. తెలుగుతో పాటు ఆంగ్లపత్రికలను అనుసరించాలి.
యూనిఫాం ఉద్యోగాల కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి?
తెలంగాణ ఉద్యమం, ఆవిర్భావం, పథకాలు లాంటి పలు అంశాలను చదివితే బాగుంటుంది. ప్రామాణిక అంశాలతో కూడిన పుస్తకాలను, నిపుణులు రాసిన పుస్తకాలను అధ్యయనం చేయాలి.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటుందా?
ఏ నోటిఫికేషన్లోనైనా అన్ని కోటాలకు సంబంధించిన రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఈడబ్ల్యూఎస్ విభాగంలో 10 శాతం రిజర్వేషన్ కూడా అమలు చేస్తారు.
చదివిన అంశాలను ఎట్లా గుర్తుంచుకోవాలి?
చదివిన పాఠ్యాంశాలను మళ్లీ, మళ్లీ పునశ్చరణ చేయాలి. యోగా, ధ్యానం చేయండి. నిద్రకు ఉపక్రమించాలంటే గంట ముందు నుంచే స్మార్ట్ ఫోన్, టీవీ, గాడ్జెట్స్, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి.
బిట్స్ రూపంలో చదివితే మంచిదా?
పోటీ పరీక్షల కోసం కేవలం బిట్స్ రూపంలో చదివితే తికమకపడే అవకాశం ఉంటంది. కాబట్టి పాఠ్యాంశాల వారీగా సమగ్రంగా చదవడం ఉత్తమం. ఇందువల్ల ఎక్కడి నుంచి ఏ ప్రశ్న అడిగినా జవాబు చేసేందుకు సులువుగా ఉంటుంది.
జనరల్ స్టడీస్కు ఎట్లా ప్రిపేర్ కావాలి?
కేవలం జనరల్ స్టడీస్కే కాదు ఏ సబ్జక్టునైనా విజువలైజ్ చేసి చదవండి అప్పుడు మన బ్రెయిన్ పూర్తిస్థాయిలో స్టోరేజ్ చేసుకుంటుంది. ఒక గంట చదివిన తర్వాత.. ఐదు నిమిషాలు పాఠ్యాంశంతో పాటు విజువలైజ్ చేసుకోండి.
టైం టేబుల్ ఎలా రూపొందించుకోవాలి?
ప్రతిరోజూ ఒక నిమిషం నుంచి ఒక గంట.. ఒకరోజు, ఒక వారం ఇట్లా ప్రణాళిక రూపొందించుకోవాలి. అవసరం లేనివాటిని పక్కనపెట్టాలి. కొలువు సాధిస్తాననే ఆత్మైస్థెర్యాన్ని మనకు మనమే రూపొందించుకోవాలి. బలమైన కోరిక, పట్టుదల ఉండాలి.
నెగ్గాలంటే సాధన చేస్తూనే ఉండాలి
పోటీ పరీక్షలలో నెగ్గుకు రావాలంటే రోజువారీ ప్రణాళికలు వేసుకుని, క్రమశిక్షణగా చదువుకోవాలి. నెగ్గాలంటే సాధన చేస్తూనే ఉండాలి. అయితే పోటీ పరీక్షల నేపథ్యంలో విజయం సాధించే క్రమంలో ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ప్రిపరేషన్లో ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి. ఈ క్రమంలో ప్రవేశ పరీక్షలకు-పోటీ పరీక్షలకు తేడా తెలుసుకొని, ఆ మేరకు ప్రిపేర్ అవ్వాలి. నిపుణుల సలహాలు తీసుకోవాలి. ప్రిపరేషన్లో భాగంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి కృషి చేయాలి. మొత్తంగా విజయమే లక్ష్యంగా సాధన కొనసాగే విధంగా బ్రెయిన్ పవర్ను మెరుగుపరుచుకోవాలి.
– సీఎస్ వేప, సబ్జెక్టు నిఫుణులు
నిపుణను వినియోగించుకోండి
కాలేజీ దశ పూర్తయిన వెంటనే ఉద్యోగం కోసం చాలా చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఆ ప్రయాణంలో మనం ఎదుర్కొనే ఒత్తిడి అంతా ఇంతా కాదు. గ్రూప్-1, గ్రూప్-2, సబ్ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, టీచర్లతో కలిపి రాష్ట్రంలో ఒకే సారి 80 వేల ఉద్యోగాల కోసం అతి పెద్ద ఉద్యోగ ప్రకటన చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఇంతటి గొప్పపని సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం అయింది. ఈ క్రమంలో నిరుద్యోగులకు పోటీ పరీక్షల పట్ల అవగాహన కల్పించే అంశంపై ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ‘కొలువు-గెలువు’ పేరుతో అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమం జరిగిన ప్రతిచోటా మంచి స్పందన వస్తున్నది. గతంలో వారానికోసారి వచ్చే నిపుణ సంచిక ఇప్పుడు ఉద్యోగార్థుల కోసం ప్రతిరోజూ ఇస్తున్నాం. అందులో జనరల్ స్టడీస్, చరిత్ర, జాగ్రఫీ, పర్యావరణం, కరెంట్ అఫైర్స్పై అవసరమైన మెటీరియల్ అందజేస్తున్నాం. వాటిని కూడా చదివి మీరు పరీక్షల్లో గెలిచి కొలువులు దక్కించుకోండి.
– చిరంజీవి, నమస్తే తెలంగాణ వైస్ ప్రెసిడెంట్
జనరల్ స్టడీస్కు పత్రికలను చదవండి
సాధారణంగా ఏటా యూపీఎస్సీ విడుదల చేసే సివిల్స్ నోటిఫికేషన్లో దేశవ్యాప్తంగా 800 నుంచి వెయ్యి లోపు పోస్టులు ఉంటాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. మీ జీవితకాలంలో ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇంకొకటి ఉండదు. పోటీ పరీక్షల సాధన కోసం నిరంతరం కృషి చేయాల్సిందే. సబ్జెక్టు లోతుల్లోకి వెళ్లేముందు సిలబస్ ఏముందో క్షుణ్నంగా అధ్యయనం చేయండి. పోటీ పరీక్షల కోణంలో వార్తాపత్రికలు ఆకళింపు చేసుకుని చదువాలి. ఏది దొరికితే అది చదవకండి. ప్రామాణికమైన రచయితలు రాసిన పుస్తకాలనే ఆశ్రయించండి. కరెంట్ అఫైర్స్ ఇష్యూలపై పలు ప్రశ్నలు వేసుకుంటూ అంశాలను అధ్యయనం చేయండి. కోచింగ్ తీసుకోలేకపోయామేనన్న బాధ అవసరం లేదు. టీ సాట్ లాంటి ప్రభుత్వ చానళ్లను ఫాలో అవండి. ఎన్ని పుస్తకాలు ఉన్నా..ఎన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నా సబ్జక్టుపై మీకు ఉన్న అవగాహనే మిమ్మల్ని పరీక్షల్లో నిలబెడుతుంది. పోటీ పరీక్షలకు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులే ఎక్కువగా పోటీ పడుతున్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించే అవగాహన కార్యక్రమాలు నిజంగా అభినందనీయం. స్వయంకృషితో ముందుకు సాగండి. ప్రభుత్వం కేవలం నోటిఫికేషన్ జారీ చేస్తే అక్కడితో వారి బాధ్యత తీరిపోతుంది. కానీ దేశంలో ఏ ప్రభుత్వమూ చేయనట్లుగా తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసి ఆ పరీక్షకు ప్రిపేర్ అయ్యేవారికి ప్రతి నియోజకవర్గంలో ఉచితంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇంత గొప్ప పని చేస్తున్నందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. మరి కొద్ది రోజుల్లోనే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కూడా పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను తీసుకొస్తాం. – ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్
సెల్ఫోన్కు దూరంగా ఉండండి
పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే ముందు మిమ్మల్ని మీరు మానసికంగా శారీరకంగా సన్నద్ధం చేసుకోవాలి. రాత్రి పదింటికల్లా పడుకుంటే మరీ మంచిది. ఉదయం నాలుగింటికల్లా లేవండి. బ్రహ్మ ముహూర్తంలో లేచి చదివితే మంచి ఫలితాలుంటాయి. ప్రిపరేషన్కు అవసరమైన షెడ్యూల్ను తయారు చేసుకోవాలి. ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు ఏ రోజు, ఏ గంటలో ఏ టాపిక్ చదవాలి? ఏ సమయానికి క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయాలి? నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఏ టైంకి ఆ నోట్స్ను రివిజన్ చేసుకోవాలి? ఎప్పుడు పడుకోవాలి? ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలి? అని టైం టేబుల్ తయారు చేసుకొని ఫాలో అవ్వాలి. అన్నింటికన్నా ముఖ్యంగా సెల్ఫోన్ పక్కన పెట్టండి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా వంటి సోషల్ మీడియా జోలికి వెళ్లకండి. కేవలం మాట్లాడుకునేందుకు మాత్రమే సెల్ఫోన్ వాడండి. అంతేకానీ ఎంటర్టైన్మెంట్ విషయాలను సెర్చ్ చేసేందుకు ఫోన్ను వాడితే మీరు డైవర్ట్ అవుతారు. టైం మేనేజ్మెంట్ చాలా చాలా ముఖ్యం. పక్కవాళ్లు 16 గంటలు చదువుతున్నారని తెలిసి మీరు కూడా అలాగే చేద్దామని చూడకండి. ఎవరికి వాళ్లే సొంతంగా పర్సనల్ స్ట్రాటజీ తయారుచేసుకోవాలి. మీరు ఎన్ని గంటలు చదవాలో? ఏ పుస్తకాలు చదవాలో? మీరే ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజూ పత్రికలు చదివి కరెంట్ అఫైర్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. పరీక్ష పూర్తయ్యే వరకు మీ ఆరోగ్యం బావుండేలా చూసుకోండి. ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్లు రన్నింగ్, జంపింగ్ ప్రాక్టీస్ చేస్తూ..గాయాలకు గురికాకండి. కొలువుల సాధనకు షార్ట్కట్స్ ఏమీ ఉండవు. పైరవీలు చేస్తే ఉద్యోగాలు వస్తాయేమోనన్న భ్రమ ఉంటే…దాన్ని వీడండి. ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నది. మెరిట్ ఉన్నవారే విజేతలవుతారు. – ఆర్టీసీ ఎండీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్
భయాల్ని వీడండి
1994లో సర్పంచ్గా ఉన్న సమయంలో నా గొంతులో బుల్లెట్ దిగింది. వోకల్ కార్డ్ దెబ్బతిని నోటి మాట పోయింది. గొంతులో నుంచి మాట పెద్దగా రావడం లేదు. ఆపరేషన్ కోసం ముంబై పోయాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ చేయించుకోవద్దని డాక్టర్లు చెప్పారు. జనంలోకి వెళ్లి వారితో కమ్యూనికేట్ చేయాలంటే గొంతు ఉంటేనే కదా మాట్లాడగలిగేది. మరి గొంతే లేనప్పుడు నేను ఎలా మాట్లాడగలనా? ఇక నాకు గొంతే రాదని భయపడ్డా. నా రాజకీయ జీవితం ముగిసిపోయిందేమోనని అనుకున్నా. కానీ భయపడకుండా ధైర్యంగా నిలబడ్డాను. అడ్డంకులు తొలగించుకొని మెలమెల్లగా గొంతు తెచ్చుకోగలిగాను. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. యువతకు నేనిచ్చే సలహా ఒకటే. ఉద్యోగ పరీక్షలంటే భయంగానే ఉంటుంది. కాని పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే భయాన్ని పక్కన పెట్టాలి. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు, ఆటు పోటులు ఎదురైనప్పటికీ లక్ష్యాలు దెబ్బతినకుండా ధైర్యంతో ముందుకు సాగితే విజయం లభిస్తుంది. ప్రభుత్వమే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయడంతో పాటు పరీక్షలలో విజయం సాధించడం కోసం ఉచిత భోజనంతో పాటు ఉచిత కోచింగ్ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో నిరుద్యోగ యువత కష్టపడి ప్రిపేర్ కావడమే ఒక్కటే మిగిలి ఉంది. ఉద్యోగ పరీక్షలలో విజయం సాధించాలంటే నిపుణులు బోధించే పాఠాలను శ్రద్ధగా వినడంతో పాటు వాటిని ఆచరించాలి. నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించడం కోసం నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కొలువు-గెలుపు’ కార్యక్రమం నిజంగా అభినందనీయం
– బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఛైర్మన్
ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిందే
పోటీ పరీక్షల్లో ప్రశ్నల సరళి మారుతూ వస్తున్నది. అభ్యర్థి సామర్థ్యాన్ని పరిశీలించేందుకు, ఎక్కువ మందిని ఫిల్టర్ చేసే క్రమంలో మల్టిపుల్ చాయిస్ ఇచ్చి అందులో ‘ ఏది కరెక్టు కాదు’ అని కూడా అడుగుతున్నారు. అందుకే సబ్జెక్టును లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ ఆండ్ టెక్నాలజీలో కరోనా వైరస్, టీకాలు, ల్యాబులు, కరోనా గ్రాఫ్ల గురించి రకరకాల ప్రశ్నలు అడగవచ్చు. జాగ్రఫికల్ ఇండెక్స్ (భౌతిక సూచిక) ట్యాగ్లనూ అడగొచ్చు. 4జీ-5జీ టెక్నాలజీ మధ్య తేడా ఏమిటి? అగ్ని-5, అగ్ని-6 ల మధ్య తేడాలు ఏమిటి? వంటివి ప్రశ్నిస్తారు. తెలంగాణ సోషియో ఆండ్ ఎకనమిక్ సర్వే తప్పనిసరిగా చదవండి. ఇటీవలి కాలంలో వ్యక్తుల గురించి కాకుండా వ్యవస్థలు, ఆవిష్కరణల ఫలాలపై ప్రశ్నలను ట్విస్ట్ చేసి ఇస్తున్నారు. ఎకానమీలో బ్యాంకులు, జీడీపీ రేషియో, ద్రవ్యోల్బణం వంటి అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయండి. 142 వ రాజ్యాంగ సవరణ, నాటో, డబ్ల్యుటీవో గురించి తెలుసుకోవాలి. తెలంగాణ తొలి దశ ఉద్యమం, మలిదశ ఉద్యమంతో పాటు తెలంగాణ చరిత్ర, ఇతిహాసాలు, కవులు, కళాకారులు, ఆర్థిక వ్యవస్థ, గుడులు, గోపురాలు, పండుగలు, సంప్రదాయాలు, రచయితలు, ఉద్యమకారులు, విద్యా సంస్థలు, తెలంగాణ భాష, యాస వంటి అంశాలపైనా పూర్తి అవగాహన ఉండాలి. నోటిఫికేషన్ సిలబస్లో పొందుపరిచిన అంశాలు లోతుగా విశ్లేషిస్తూ అన్ని కోణాలలో చదువుకోవాలి.
– బాలలత, సీఎండీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్
అమ్మకు మాట ఇచ్చాను
నేను 2009లో బీటెక్ పూర్తిచేశాను. గ్రూప్2కు సన్నద్ధమవుతున్నాను. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో సదస్సు జరుగుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఈ సదస్సు నాకు ఎంతో నేర్పింది. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తానని అమ్మకు మాట ఇచ్చాను. ఆ అవకాశం నాకు ప్రభుత్వం కల్పించింది. నేను సద్వినియోగం చేసుకుని కొలువు సంపాదిస్తాను. ఎలా ఉద్యోగం సాధించాలో వక్తలు చెప్పిన మాటలు నాకు ప్రేరణ ఇచ్చాయి. అనవసర పుస్తకాలు చదవకుండా సరైన బుక్స్ ఎంపిక చేసుకుని వాటిని చదివితే చాలు అనే విషయం తెలుసుకున్నాను. -కె.పల్లవి. ఆర్కె.పురం
సదస్సుకు హాజరయ్యే వరకు అనేక సందేహాలు
నేను గ్రూప్ 1కు సన్నద్ధమవుతున్నాను. ఎంబీఏ పూర్తిచేశాను. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలను ప్రకటించడంతో చాలా సంతోషం కలిగింది. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏం చదవాలి? ఏ పుస్తకాలు కొనుగోలు చెయ్యాలి? ఇలాంటి అనేక సందేహాలతో సమయం వృథా అయింది. బాలాలత మేడం, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిగారు మా సందేహాలన్నీ నివృత్తి చేశారు. -హరిత
థాంక్స్.. నమస్తే తెలంగాణ!
ఈ నోటిఫికేషన్లు చాలా చక్కటి అవకాశం. ఉద్యోగం తప్పనిసరిగా సాధిస్తాననే నమ్మకం నాకుంది. ఈ అవకాశం కోసం నిరుద్యోగులం ఎంతో ఎదురుచూశాం. పోటీ పరీక్షల్లో రాణించేందుకు అవసరమైన సూచనలు-సలహాలు ఇచ్చేందుకు నమస్తే తెలంగాణ-తెలంగాణ టు డే నిర్వహిస్తున్న ఈ సదస్సులు నిజంగానే ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. థాంక్స్ నమస్తే తెలంగాణ.
–మహ్మద్ ఫర్ధీన్-ఇంటర్మీడియెట్..(సికింద్రాబాద్)
ఆత్మైస్థెర్యాన్ని నింపింది..
ఈ పోటీ పరీక్షల అవగాహన సదస్సు మాలో ఆత్మైస్థెర్యాన్ని నింపింది. నిరుద్యోగుల్లో ఎంతో చైతన్యం కలిగించింది. కచ్చితంగా పోలీస్ ఉద్యోగం సాధిస్తా. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. ఎన్నడూలేని విధంగా ఇన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం సంతోషంగా ఉంది.
– కే. రాహుల్ గౌడ్, బీకాం..(ముషీరాబాద్)
సదస్సు దోహదపడింది
కష్టపడి చదువుతున్నా. తప్పనిసరిగా పోలీసు ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం నాకుంది. తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజా సేవ చేయాలన్నాదే నా లక్ష్యం..నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే దినపత్రికల ఆధ్వర్యంలో ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించడం గర్వంగా ఉంది. –కే. స్వాతి, బీకాం సెకండియర్..(చిలుకలగూడ)
అపోహలు తొలగిపోయాయి
నేను డిగ్రీ చేస్తున్నాను. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడానికి ప్రిపేర్ అవుతున్నాను. ఈ సదస్సు మాలాంటి వారికి చాలా ఉపయోగపడుతుంది. పేపర్ ఎలా వస్తుంది? ఏ టాపిక్స్ చదివితే ఉపయుక్తంగా ఉంటుందో తెలుసుకున్నాను. మా అపోహలన్నీ తొలిగిపోయాయి. మాకోసం సదస్సు నిర్వహించి మాకు అండగా నిలిచిన నమస్తే తెలంగాణ యాజమాన్యానికి కృతజ్ఞతలు. –లక్ష్మి
సందేహాలను నివృత్తి చేశారు
మేం ప్రభుత్వ ఉద్యోగం సాధించే ప్రయత్నంలో మాకు వారధిగా నిలుస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు ధన్యవాదాలు. మాకు పరీక్షల పట్ల ఉన్నభయం, ఒత్తిడి, సందేహాలను ప్రముఖ వక్తలతో నివృత్తి చేయించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని ఉద్యోగాలు ఒకేసారి రాబోతుండటం ఇదే తొలిసారి. ఇకముందర ఇలాంటి ఉద్యోగాల ప్రకటన ఉండదేమో. మాకు గొప్ప అవకాశం ఇచ్చిన తెలంగాణ సర్కార్కు రుణపడి ఉంటాం. –మహేష్, దివ్యమణి(దంపతులు).
అనుభవజ్ఞుల సూచనలు బాగున్నాయి
పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఇలాంటి అవగాహన సదస్సులు ఎంతో ఉపయోగపడుతాయి. అనుభవజ్ఞుల సూచనలు గెలుపుకు దోహదపడతాయి. కానిస్టేబుల్, ఎస్ఐ, ఎక్సైజ్ ఎస్ఐ కావాలన్నదే నా లక్ష్యం. మూడింటిలో ఏదైనా ఒక ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం ఈ అవగాహన సదస్సు నాలో ధైర్యాన్ని నింపింది. –డి. విజయలక్ష్మి, పోస్టుగ్రాడ్యుయేట్..(చిక్కడపల్లి)
కొలువు కొట్టి తీరుతా..
కష్టపడి చదివి కొలువు సాధిస్తా. తల్లిదండ్రుల ఆశయం నెరవేరుస్తా. తెలంగాణ ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఇలాంటి ఉద్యోగ అవగాహన సదస్సులు నిర్వహించడం పట్ల నిరుద్యోగుల్లో ఉత్సాహం పెరుగుతుంది. కొలువును ఎలా గెలవాలో నమస్తే తెలంగాణ మంచి మెళకువలు నేర్పించింది.
–టి. తేజ, బీఫార్మసీ…(మెహిదీపట్నం)