హయత్నగర్, జూన్ 6 : తెలంగాణ ప్రభుత్వం కృషితో నగర శివారు ప్రాంతంలోని హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కార్పొరేట్ చదువులకు దీటుగా కొనసాగుతున్నది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) పీర్ కమిటీ సందర్శనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.జ్యోత్స్నప్రభ సారథ్యంలో అధ్యాపకుల బృందం, వలంటీర్లతో కలిసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. హయత్నగర్ పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన విద్యార్థులకు ఈ కళాశాల పట్టభద్ర విద్యను అందిస్తున్నది. నగరానికి సమీపంలో ఉండటంతో ఇతర జిల్లాల విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు. ఈ డిగ్రీ కళాశాలకు ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అందులో 1.5 ఎకరాల్లో రూ.2.25 కోట్లతో నూతన భవన నిర్మాణాన్ని చేపట్టి పూర్తిచేశారు. మిగిలిన 3.5 ఎకరాల స్థలాన్ని ట్రాక్లు, క్రీడా మైదానం, ఇతర అవసరాలకు ఉపయోగించనున్నారు. కళాశాలలో ప్రస్తుతం 1505 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మరో మూడేండ్లలో 3000 మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా దూర విద్యను అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రతి ఐదేండ్లకు ఒకసారి న్యాక్ సంస్థ దేశ వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలను సందర్శించి, అక్కడనున్న పరిస్థితులను పరిశీలిస్తారు. ఈ పరిశీలనలో ప్రధానంగా విశ్వవిద్యాలయాల నాణ్యతా ప్రమాణాలు, మౌలిక సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాల లభ్యతను పరిగణనలోకి తీసుకొని ఆయా విద్యా సంస్థలకు గ్రేడ్లను కేటాయిస్తారు. ఈ గ్రేడ్ ఆధారంగానే విశ్వవిద్యాలయాల నిధుల సంఘం ఆయా విద్యా సంస్థలకు నిధులు కేటాయిస్తుంది. 2008లో హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు న్యాక్ గ్రేడ్ కోసం దరఖాస్తు చేయలేదు. ఈనెల 8, 9 తేదీల్లో జైపూర్ నేషనల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ అంజనా శర్మ, మిజోరం యూనివర్సిటీ ప్రభుత్వ పాలనా శాస్త్ర విభాగ ప్రొఫెసర్ శ్రీనివాస్ పతి, హుబ్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ప్రిన్సిపాల్ డాక్టర్ చెన్నబసవ గౌడ యత్నల్లితో కూడిన బృందం కళాశాలను సందర్శిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
క్రమశిక్షణతో కూడిన ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ…
కళాశాల అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఏఐఎంఎస్) సంస్థతో ఎఫెక్టివ్, ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ అమలు చేయబడుతున్నది. దీంతోపాటు కళాశాలలో రెండు ఎన్ఎస్ఎస్ యూనిట్లు, ఎన్సీసీ కూడా అందుబాటులో ఉంది. అధునాతన కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.
ఆకట్టుకుంటున్న క్లాస్ రూంలు, ల్యాబ్లు, లైబ్రరీ…
కళాశాలలో డిజిటల్ క్లాస్ రూమ్లు, ప్రొజెక్టర్లు, వర్చువల్ క్లాస్ రూమ్లు, గ్రీన్ బోర్డులు, కంప్యూటర్ సిస్టమ్స్ టీచింగ్ లెర్నింగ్ ఎయిడ్లు అందుబాటులో ఉన్నాయి. అధ్యాపకులు, విద్యార్థుల మధ్య ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ కోసం ఫోరమ్లు, సెమినార్లు నిర్వహిస్తున్నారు.
పరిశోధనల విద్యకు కళాశాల ఆదర్శం
బడుగు, బలహీన వర్గాల పిల్లల ఉన్నత చదువుల కోసం హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదర్శంగా నిలుస్తున్నది. కళాశాలలో విద్యనభ్యసిస్తున్న పలువురు విద్యార్థులకు పరిశోధనల విభాగంలో బహుమతులు కూడా లభించాయి. ఇలాంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ కె.జ్యోత్స్నప్రభ, ప్రిన్సిపాల్ హయత్నగర్ డిగ్రీ కళాశాల