బడంగ్పేట, ఆగస్టు 1: బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రోడ్లకు మహర్దశ రానుంది. పెరుగుతున్న జనాభాను, ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ తరాల కోసం రోడ్లను విస్తరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణ ప్రభుత్వం రోడ్ల విస్తరణ కోసం, లింక్ రోడ్లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ.188 కోట్లు మంజూరు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు, ట్రిపుల్ ఆర్కు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేయడానికి వందల కోట్లు కేటాయించారు. ఆర్సీఐ ఎక్స్ రోడ్ నుంచి ఎయిర్ పోర్టు హోటల్ వరకు, శ్రీశైలం హైవే నుంచి బడంగ్పేట వరకు 2.60 కిలో మీటర్ల మేరకు రోడ్డును అభివృద్ధి చేయడానికి రూ.32 కోట్లు కేటాయించారు.
మల్లాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కుర్మల్ గూడ, బడంగ్పేట వరకు 3.29 కిలో మీటర్లకు రూ.38 కోట్లు, కుర్మల్ గూడ నుంచి నాదర్గుల్, బడంగ్పేట వరకు 3.30 కిలో మీటర్లకు రూ.40 కోట్లు, బడంగ్పేట మెయిన్ రోడ్ నుంచి తుర్క యంజాల్ వరకు 3.80 కిలోమీటర్లకు రూ.46 కోట్లు, బడంగ్పేట నుంచి నాదర్గుల్ మెయిన్ రోడ్డు వరకు 2.60 కిలో మీటర్లకు రూ.32 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే రోడ్ల పనులు చేపట్టనున్నారు. రోడ్ల విస్తరణకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి రోడ్డు విస్తరణ అయితే ట్రాఫిక్ సమస్య పూర్తిగా సమసిపోతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇరుకు రోడ్డులను విస్తరించడం వలన ప్రయాణ సౌలభ్యం మెరుగు పడుతున్నదని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల తరబడి ఉన్న సమస్యకు తెర పడనుందని ప్రయాణికులు తెగ సంబుర పడుతున్నారు.
భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని విస్తరణ
భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రోడ్ల విస్తరణకు వందల కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే లింగ్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నది. ఔటర్, ట్రిపుల్ ఆర్ను అనుసంధానం చేస్తూ రోడ్లను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన రహదారులను విస్తరిస్తున్నాం. త్వరలోనే టెండర్ వేయించి పనులు మొదలు పెడ్తాం.
– మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి
బడంగ్పేటకు రూ.188 కోట్లు మంజూరు
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్కు రూ.188 కోట్లు మంజూరయ్యాయి. అందుకు సంబంధించిన సరులర్ కూడా వచ్చింది. పెండింగ్లో ఉన్న రోడ్డు పనులు పూర్తి కావడానికి అవకాశం ఉంది. అన్ని ప్రధాన రహదారులు అభివృద్ధి అవుతాయి. ఏ రోడ్డు ఎంత వరకు తీసుకుంటారనేది త్వరలో ప్రభుత్వం సర్కులర్లో తెలుపుతున్నది. ప్రస్తుతం బడంగ్పేట నుంచి నాదర్గుల్ వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు రాగానే పనులు మొదలవుతాయి.
– కమిషనర్, కృష్ణ మోహన్ రెడ్డి