Khairatabad Ganesh | ఖైరతాబాద్, సెప్టెంబర్ 19 : భక్త జన కోటికి కొంగు బంగారమైన ఖైరతాబాద్ గణేశుడు కొలువుదీరాడు. ఈ ఏడాది కొత్త రికార్డును నెలకొల్పుతూ 63 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించడం విశేషం కాగా, శ్రీ దశ మహా విద్యా గణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు. వినాయకచవితి సందర్భంగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి తొలి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఖైరతాబాద్ గణేశుడికి ఎంతో ప్రత్యేకత ఉన్నదన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ, శాంతులతో ఉండాలని గణనాథుడిని కోరుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. వినాయకుల మండపాల వద్ద భద్రత, ఏర్పాట్లు ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణలో జరుగుతున్నాయని చెప్పారు. ఖైరతాబాద్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే రైల్వే స్టేషన్, సచివాలయం నుంచి సెన్సేషన్ థియేటర్ వరకు సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టారన్నారు.
విద్యుత్, ట్రాన్స్పోర్టు విషయంలో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. గతంలో ఇక్కడ డబ్బులు పెట్టి నిర్వహిస్తుండే వారని, కాని నేడు ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా నవరాత్రుల నుంచి సాగర్లో నిమజ్జనం చేసే వరకు సకల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జర్మనీ కంపెనీతో మాట్లాడి ప్రత్యేక క్రేన్ను సైతం ఏర్పాటు చేస్తున్నామని, వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. ఈ వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, కార్పొరేటర్ పి.విజయా రెడ్డి, మహేశ్ యాదవ్, మహేందర్బాబు, ప్రవీణ్ కుమార్, బాక్సర్ అశోక్, లక్ష్మణ్ యాదవ్, చందు, మధుకర్ యాదవ్, అనిల్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
8 కేజీల వెండి జంధ్యం …
ఖైరతాబాద్, సెప్టెంబర్ 19 : ఖైరతాబాద్ మహా గణపతికి ఎమ్మెల్యే దానం నాగేందర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 8 కేజీల భారీ వెండి జంధ్యాన్ని ఎమ్మెల్యే ఖైరతాబాద్ గణేశుడికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహేశ్ యాదవ్, మహేందర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
కూకట్పల్లిలోని ‘అశోక వన్ మాల్’లో బిగ్ ఎఫ్ఎం ఆధ్వర్యంలో బిగ్ గ్రీన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కాగితాలు, మట్టితో తయారు చేసిన గణనాథుడిని ప్రతిష్ఠించారు. మంగళవారం సినీ నటులు ఆనంద్ దేవరకొండ, రాజ్తరుణ్, మాల్వి మల్హోత్ర, ఎ.ఎస్.రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరై వినాయకుడిని దర్శించుకున్నారు. అనంతరం చిన్నారులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ గౌతంరెడ్డి, సీఈవో మసూద్ మాలిక్, బిగ్ ఎఫ్ఎం ఆర్జేలు పాల్గొన్నారు.
వనస్థలిపురం పరిధిలో రెడ్ వాటర్ ట్యాంకు వద్ద అభిమన్యు యూత్ మండపంలో కొలువుదీరిన పచ్చి కొబ్బరి, రుద్రాక్షలతో తయారు చేసిన గణపతులు
గణేశ్ నవరాత్రులను పురస్కరించుకొని సికింద్రాబాద్ గణపతి ఆలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ చైర్మన్ సత్యనారాయణ, పాలక మండలి సభ్యులు సన్మానించారు.