హైదరాబాద్ : ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు బోధన జరగాలనేది ప్రభుత్వ ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ‘మన బస్తీ- మన బడి’ కార్యక్రమంలో భాగంగా జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠాలు ఎలా చెబుతున్నారు?, భోజనం బాగుంటుందా? అని పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలలో ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా అని పాఠశాల సిబ్బంది, విద్యాశాఖ అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెండు తరగతి గదులు నిర్మించాల్సి ఉందని తెలపగా.. ACDP నిధులతో నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం 7,200 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. గత ప్రభుత్వాలు విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారం పై దృష్టి సారించలేదని విమర్శించారు.
కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా వైద్యాధికారి రోహిణి, కార్పొరేటర్ హేమలత, పద్మారావు నగర్ టీఆర్ఎస్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.