Balapur | లక్షల విలువైన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఫర్నిచర్ను గాలికి వదిలేశారు. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తరగతి గదుల్లో ఉన్న ఫర్నిచర్ను తీసి..పాఠశాలల మైదానంలో వేశారు. అయితే పోలింగ్ పూర్తయిన వెంటనే వాటిని తిరిగి తరగతి గదుల్లో పెట్టించాలన్న ఆలోచనను అధికారులు మర్చిపోయారు. దీంతో విలువైన ఫర్నిచర్ పాడయ్యే అవకాశమున్నది. బాలాపూర్ మండల పరిధిలోని అన్ని సర్కారు స్కూళ్లలో ఇదే పరిస్థితి నెలకొన్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ కింద కోట్లు ఖర్చు చేసి.. ప్రతి ప్రభుత్వ పాఠశాలలకు కొత్త ఫర్నిచర్ను అందజేశారు. ఇవి నాలుగు కాలాల పాటు విద్యార్థులకు ఉపయోగపడేవి. ఇదిలా ఉంటే మున్సిపల్ అధికారులు మాత్రం ఎవరి ఫర్నిచర్ వారే చూసుకోవాల్సిందేనంటున్నారు. ఈ విషయమై విద్యాధికారులకు ఫోన్లు చేసినా.. స్పందించలేదు. కొందరు ఉపాధ్యాయులు స్పందించి మున్సిపల్ అధికారులు చూసుకుంటారని సమాధానాన్ని దాట వేశారు. మీర్పేట ప్రభుత్వ పాఠశాలలో ఆరుబయట పడేసిన ఫర్నిచర్ను చిత్రంలో చూడొచ్చు.
-బడంగ్పేట, మే17