Google Mapping | మేడ్చల్, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ, సీలింగ్ భూముల గూగుల్ మ్యాపింగ్ను రెవెన్యూ యంత్రాంగం సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సర్కారు స్థలాలను గుర్తించి గూగుల్ మ్యాప్లో నమోదు చేస్తున్నారు. జిల్లాల్లోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని 15 మండలాల్లో 5,196 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది.
ప్రభుత్వ ఖాళీ భూముల వివరాల గూగుల్ మ్యాప్ను తయారు చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం గూగుల్ మ్యాప్ను చేసేందుకు చర్యలు చేపట్టింది. గతంలోనే జిల్లాలో ప్రభుత్వ భూములను అధికారులు గుర్తించారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాల మేరకు మరోసారి గుర్తించి వాటి సంరక్షణకు గూగుల్ మ్యాప్ను సిద్ధం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. కాగా, ప్రస్తుతం ప్రభుత్వ సంరక్షణలో ఎంత భూమి ఉందన్న విషయాన్ని రెవెన్యూ అధికారులు తేల్చనున్నారు.
మేడ్చల్ జిల్లాలోని రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉప్పల్ మండలంలో 333 ఎకరాలు, మల్కాజిగిరి మండలంలో 113, మేడ్చల్ 37, బాలనగర్ మండలంలో 700, శామీర్పేట్ మండలంలో 420, దుండిగల్ (గండిమైసమ్మ) మండలంలో 425, మేడిపల్లి మండలంలో 900, ఘట్కేసర్ మండలంలో 500, కాప్రా మండలంలో 400, కీసర మండలంలో 417, కుత్బుల్లాపూర్ మండలంలో 600, బాచ్పల్లి మండలంలో 360 ఎకరాలు ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం భూముల గుర్తింపు అనంతరం గూగుల్ మ్యాపింగ్ సిద్ధం కానున్నది.