సుల్తాన్బజార్, జూన్ 20 : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పది గంటల్లోనే తీవ్ర అస్వస్థతకు గురైన బాలింతను ప్రభుత్వ ప్రసూతి దవాఖాన అక్కున చేర్చుకొని… దాదాపు 8 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి పునర్జన్మను ప్రసాదించారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకి చెందిన కె.స్రవంతి(28) రెండవ కాన్పు నిమిత్తం ఈ నెల 18న గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో చేరింది. అక్కడ అదే రోజు ఉదయం పది గంటలకు సిజేరియన్ చేయగా.. స్రవంతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కాగా.. రాత్రి 7 గంటల సమయంలో తీవ్ర కడుపునొప్పి వచ్చి.. స్పృహ కోల్పోయింది. వెంటనే అక్కడి వైద్యు లు.. మెరుగైన వైద్యం కోసం సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూ తి దవాఖానకు తీసుకెళ్లాలని సూచించగా.. బాలింత భర్త శ్రీనివాస్ ఇక్కడికి తీసుకొచ్చాడు. వైద్యులు పరీక్షించి.. ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని గుర్తించి.. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె సూచన మేరకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. కడుపులో తీవ్ర రక్త స్రావం అవుతున్నట్లు, కడుపు నుంచి ఛాతి వరకు నాలుగు యూనిట్ల రక్తం గడ్డ కట్టిందని గుర్తించారు. వెంటనే అదే రోజు రాత్రి పది గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు లాప్రాటమీ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి.. బాలింత స్రవంతికి పునర్జన్మను ప్రసాదించారు. ఈ చికిత్సలో బాలింతకు 12 యూనిట్ల రక్తాన్ని ఎక్కించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
దవాఖానకు వచ్చిన రోగుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. ఇటీవల దవాఖానకు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చిన గర్భిణులు, బాలింతలను అక్కున చేర్చుకొని.. వారికి అవసరమైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించాం.. ప్రభుత్వ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం.- డాక్టర్ రాజ్యలక్ష్మి, సుల్తాన్బజార్ ప్రసూతి దవాఖాన సూపరింటెండెంట్