సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మొదటి జాబితా విడుదల చేసినప్పటి నుంచే చాలా మంది ఆశావహులు నిరుత్సాహానికి గురయ్యారు. చాలా మందిలో అగ్గి రాజుకున్నట్టు అయ్యింది. కొత్త ముఖాలకు టికెట్లు ఇవ్వడంతో నిప్పు అంటుకున్నట్టు అయ్యింది. కాగా, హైదరాబాద్ మహా నగరంలో కాంగ్రెస్ టికెట్ ఫర్ సేల్ అగ్గి రాజేసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలకు టికెట్లు అమ్ముకున్నారంటూ అనేక నియోజకవర్గాల్లో ఆశావహులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఆ పార్టీ రెండో జాబితా పలుచోట్ల కుమ్ములాటలకు కారణమైంది.
మొదటి జాబితాతోనే అగ్గి ఆశావహుళ్లో అగ్గి రాజుకున్నట్టు ఉండగా, రెండో జాబితా విడుదల చేసి అప్పటి వరకు మిన్నకుండిన ఆశావహుల్లో రాజుకున్న అగ్గిపై గుగ్గిలం చల్లినట్టు అయ్యింది. ‘అగ్గి మీద గుగ్గిలం’ చల్లి మంటలు మరింత ఎగిసిపడేలా ఆజ్యం పోసేందుకు ‘టికెట్ ఫర్ సేల్’ ఉదంతం దోహపడింది. అయితే, శనివారం ఉదయం ఆరోపణలతో మొదలైన ఈ వేడి… సాయంత్రానికి గాంధీభవన్ను తాకింది. జూబ్లీహిల్స్ నుంచి టికెట్ ఆశించి, భంగపడిన విష్ణువర్దన్ రెడ్డి వర్గీయులు ఏకంగా గాంధీభవన్పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. రేవంత్ టికెట్ అమ్ముకున్నాడంటూ ఆయన ఫ్లెక్సీలు చింపడంతో పాటు పార్టీ జెండాలను తగులబెట్టారు. పలువురు హస్తం పార్టీకి రాజీనామా చేయగా, మరికొందరు అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేశారు. ప్రధానంగా పలువురు నేతలు ఆదివారం అనుచరులతో సమావేశమై తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ప్యారాచూట్ నేతలకు టికెట్ దక్కడంతో స్థానిక నేతలు అప్పుడే సహాయ నిరాకరణ మొదలుపెట్టారు.
ప్యారాచూట్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పలు నియోజకవర్గాల్లో అప్పుడే కాంగ్రెస్ శ్రేణుల నుంచి అభ్యర్థులకు సహాయ నిరాకరణ మొదలైంది. ఎల్బీనగర్ అభ్యర్థిగా ప్రకటించిన మధు యాష్కీ గౌడ్ నియోజకవర్గానికి రాగా పలువురు సీనియర్ నేతలు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. యాష్కీ దిల్సుఖ్నగర్లోని సాయిబాబా దేవాలయానికి రాగా సీనియర్ నాయకులు మల్రెడ్డి రాంరెడ్డితో పాటు ఇతర సీనియర్ నాయకులెవరూ కనిపించలేదు. అదే విధంగా మహేశ్వరం టికెట్ కేఎల్ఆర్కు ఇవ్వగా, ఇక్కడ కూడా ఆయనకు సహాయ నిరాకరణ మొదలైంది. కేఎల్ఆర్ మొదటిసారిగా శనివారం నియోజకవర్గానికి రాగా… కేవలం డీసీసీ అధ్యక్షుడు చల్ల నర్సింహారెడ్డి మాత్రమే ఆయన వెంట ఉన్నట్లు తెలిసింది. టికెట్ ఆశించిన ఇతర పలువురు నేతలు ఆయన కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు.
ఆశావహులు తమకు టికెట్ రాకపోవడంతో ప్రధానంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపైనే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్లను అమ్ముకుంటున్నారని ఆదిలోనే కొందరు నేతలు గుర్తించి బయటికి వెల్లడించారు. అయినప్పటికీ చాలా మంది నాయకులు అలా ఉండకపోవచ్చని ఆశించారు. కానీ, తీరా రెండో జాబితా విడుదలైన తర్వాత ప్యారాచూట్ నేతలు, అసలు నియోజకవర్గానికి సంబంధంలేని వారిని ఎంపిక చేయడంతో కచ్ఛితంగా టికెట్ ఫర్ సేల్ పెద్ద ఎత్తున సాగిందని నమ్ముతున్నారు. దీంతో పాటు చాలాకాలంగా రేవంత్రెడ్డి మీకే టికెట్ అంటూ నమ్మించి.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారని, తీరా జాబితా దగ్గరికొచ్చే సరికి సంబంధంలేని వారిని ప్రకటించడం వారిని మరింత ఆగ్రహానికి గురి చేస్తుంది.
మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డికి ముందు నుంచి రేవంత్రెడ్డి ‘మీకే టికెట్’ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆరు గ్యారంటీల ప్రకటన కోసం కొంగరకలాన్లో ఏర్పాటు చేసిన సమావేశాన్ని పారిజాత భర్త నర్సింహారెడ్డి అన్నివిధాలుగా భారం మోసం ఏర్పాట్లు చేశారు. పైగా ఐదెకరాలు.. రూ.10 కోట్లు అంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలో కచ్ఛితంగా టికెట్ వస్తుందనే భరోసాతో వాళ్లు ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థి అంటూ ప్రచార రథాలను కూడా తయారు చేయించుకున్నారు. కానీ, జాబితాలో పేరు లేకపోవడంతో అన్ని విధాలుగా తాము మోసపోయామని సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాతో హైదరాబాద్ మహా నగర పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో ఆశావహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి శుక్రవారం ఉదయమే రెండో జాబితాను విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ… కుమ్ములాటలను ముందుగానే గుర్తించిన అధిష్ఠానం జాబితాను రాత్రి విడుదల చేసింది. అయినప్పటికీ శనివారం ఉదయం నుంచే అనేక నియోజకవర్గాల్లో అసంతృప్తి మంటలు చెలరేగాయి.